నిన్న విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మొదటి రోజు అయిదు కోట్లకు పైగా గ్రాస్ సాధించిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ సక్సెస్ మీట్ నిర్వహించి తన ఆనందాన్ని టీమ్ తో పాటు పంచుకున్నాడు. ఓపెనింగ్స్ పరంగా పెట్టుకున్న భారీ అంచనాలకు తగ్గట్టు థియేటర్ల దగ్గర అంత సందోహం లేదు కానీ గత నెల రోజులగా ఉన్న డ్రై పీరియడ్ తో పోలిస్తే జనాన్ని రప్పించడంలో అర్జున్ ఓ మోస్తరు విజయం సాధించినట్టే. కాకపోతే ఈ వీకెండ్ అనూహ్యంగా పికప్ కావడం మీద బాక్సాఫీస్ నెంబర్లు ఆధారపడి ఉంటాయి. అపోజిషన్ కొచ్చిన మిక్స్డ్ టాక్ ని ఏ మేరకు ఉపయోగించుకుంటారనేది కీలకం.
రిలీజ్ ముందు నుంచి ఇప్పటిదాకా కళ్యాణ్ రామ్ తో పాటు టీమ్ అందరూ క్లైమాక్స్ గురించి చాలా గొప్పగా చెబుతూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే హైలైట్ అవుతుందని, ఎమోషనల్ కాకుండా ఉండలేరని ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు. నిజంగానే అది షాక్ ఇచ్చేలాగే వచ్చింది. సాధారణంగా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు చేయని రిస్క్ ని కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నాడు. కథ నమ్మి బ్లైండ్ గా వెళ్ళిపోయాడు. అది ఇది ఆషామాషీగా జరగలేదు. చివరి ఘట్టం ఎలా ఉండాలనే దాని మీద చాలా వెర్షన్లు డిస్కషన్ లోకి వచ్చాయట. ఇంత ఎమోషనల్ కంటెంట్ ఫ్లాట్ గా ముగించడం ఇష్టం లేదు కాబట్టి పవర్ ఫుల్ బ్లాక్ కోసం ఎదురుచూశారు
చివరికి ఇప్పుడు చూస్తున్న క్లైమాక్స్ అందరి అంచనాలకు తగ్గట్టు ఉందని, విజయశాంతి లాంటి ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఇలా ముగిస్తేనే న్యాయం జరుగుతుందని భావించి ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదంతా కళ్యాణ్ రామే పంచుకున్నాడు. రచయిత శ్రీకాంత్ కు థాంక్స్ కూడా చెప్పాడు. విజయశాంతి మాట్లాడుతూ ఇంత రిస్క్ అనిపించే క్లైమాక్స్ ని అతను తప్ప ఎవరూ ఒప్పుకోరని అంత గొప్పగా వచ్చిందని పొగడ్తలతో ముంచెత్తారు. మంగళ బుధవారాల్లోపు బ్రేక్ ఈవెన్ అవుతుందని కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు. ఈ మేరకు బయ్యర్ల నుంచి కాల్స్ వచ్చాయి, వాళ్లంతా చాలా సంతోషంగా ఉన్నారని వివరించాడు.