38 ఏళ్ల తర్వాత శ్రీనగర్ లో లో సినిమా ప్రీమియర్

కాల్పుల మోతలు, బాంబు దాడులు, ఎదురు కాల్పులతో కశ్మీర్ లో మెజారిటీ రోజులు టెన్షన్ వాతావరణం ఉంటుంది. భూతల స్వర్గంగా పిలుచుకునే కశ్మీర్ లోయలో టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య పోరు నడుస్తూనే ఉంటుంది. అటువంటి కశ్మీర్ లో చరిత్రాత్మక ఘట్టం ఒకటి ఆవిష్కృతమైంది. 38 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో ఓ బాలీవుడ్ చిత్రం ప్రీమియర్ షో ను విజయవంతంగా ప్రదర్శించారు.

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించిన ‘గ్రౌండ్ జీరో’ సినిమా ప్రీమియర్ షో శ్రీనగర్ లోని ఐనాక్స్ థియేటర్ లో శుక్రవారం సాయంత్రం ప్రదర్శితమైంది. ఈ ప్రీమియర్ షో స్పెషల్ స్క్రీనింగ్ కు ఆ చిత్రంలో లీడ్ క్యారెక్టర్ చేసిన ఇమ్రాన్ హష్మీతో పాటు నటుడు ఫర్హాన్ అఖ్తర్, చిత్ర దర్శకుడు విజయ్ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్ర స్క్రీనింగ్ కు బీఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది కూడా హాజరయ్యారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో ఉన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల దృష్ట్యా అక్క‌డ‌ సినిమా ప్రీమియర్ షో వేయాలన్న ఆలోచన రావడం సాహసమనే చెప్పాలి. అయితే, గ్రౌండ్ జీరో చిత్ర యూనిట్ ఆ సాహసాన్ని ఛాలెంజ్ గా తీసుకుంది. 2001 పార్లమెంట్ దాడి తర్వాత బీఎస్‌ఎఫ్ ఆఫీసర్ నరేంద్ర నాథ్ ధర్ నడిపిన స్పెషల్ ఆపరేషన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఆ దాడి సూత్రధారి ఘాజీ బాబాను ధర్ అండ్ టీం ఎలా తుదముట్టించారన్న కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాతో కశ్మీర్ కు సంబంధాలు పునరుద్ధరించడంలో ఈ సినిమా ప్రీమియర్ తొలి అడుగు అని ఇమ్రాన్ హష్మి అన్నారు. కశ్మీర్ ప్రజల ప్రేమాప్యాయతలు తనను కట్టి పడేశాయని చెప్పారు.
కశ్మీర్ అంటే సినిమా షూటింగులకు ఓ స్పాట్ కాదని, ఇటువంటి వేడుకలను కూడా ఓ వేదిక అని దర్శకుడు విజయ్ అన్నారు.

వాస్తవ ఘటనలకు కొన్ని కల్పిత ఘటనలు జోడించి ఈ సినిమా తీశారు. ఏప్రిల్ 25న దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇండియన్ ఆర్మీ, బీఎస్‌ఎఫ్ హీరోలకు ఈ చిత్రాన్ని డెడికేట్ చేసింది చిత్ర యూనిట్.