పరుగులు పెడుతున్న బాలీవుడ్ రామాయణం

బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలబెడతానని చెబుతున్న రామాయణ దర్శకుడు నితేష్ తివారి దానికి అనుగుణంగా షూటింగ్ వేగంగా చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం వచ్చేలా చూసుకుంటున్నాడు. ముంబై వర్గాల కథనం ప్రకారం పార్ట్ 1 ఆల్మోస్ట్ పూర్తయ్యే స్టేజిలో ఉందట. అదేంటి రావణుడిగా నటిస్తున్న యష్ టాక్సిక్ లో బిజీగా ఉంటే ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా. అసలు కిటుకు ఇక్కడే ఉంది. అశోక వనం ఎపిసోడ్, పది తలల రావణ్ ఎంట్రీ పార్ట్ 2 లో ఉంటుందని విశ్వసనీయ సమాచారం. అంటే మొదటి భాగం పట్టాభిషేకంతో మొదలై వనవాసంతో పూర్తవ్వొచ్చు.

ఇప్పుడు రామాయణ పార్ట్ 2 ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారని తెలిసింది. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న ఈ పవిత్ర గాథలో విఎఫెక్స్ కు చాలా ప్రాధాన్యం ఉండబోతోంది. తమకు సంబంధం లేని సినిమానే అయినా ఆదిపురుష్ టైంలో వచ్చిన విమర్శలు, ఫ్లాప్ ఫలితాన్ని నితేష్ తివారి టీమ్ సీరియస్ గా విశ్లేషించుకుంది. అవి మళ్ళీ రిపీట్ కాకుండా, తమ మీద ఎలాంటి నెగటివ్ కామెంట్స్ కి తావివ్వకుండా ఒకటికి పదిసార్లు జాగ్రత్త పడుతున్నారట. 2026 దీపావళికి రామాయణ మొదటి భాగం చూడబోతున్నాం. ఆ పై ఏడాది 2027లోనే సీక్వెల్ వచ్చేస్తుంది.

కొన్ని వందలసార్లు టీవీ, వెండితెర, ఓటిటిలో చూసిన రామాయణంన ఇంకా గొప్పగా ఎలా చూపిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. అందులోనూ యానిమల్ లాంటి వైల్డ్ క్యారెక్టర్ చేసిన రన్బీర్ కపూర్ రాముడిగా ఎలా మెప్పిస్తాడనేది అసలు ఛాలెంజ్. కానీ కంటెంట్ చాలా బాగా వస్తోందని, తనతో పాటు సాయిపల్లవి కాంబో సన్నివేశాల గురించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కాబోతున్న రామాయణలో యష్ పాత్ర ప్రధాన ఆకర్షణగా కానుంది. కెజిఎఫ్ రాఖీ భాయ్ సీతను ఎత్తుకెళ్లే రావణుడిగా ఎలాంటి విశ్వరూపం చూపించబోతున్నాడోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు