మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే స్టార్ హీరోలు ఆసక్తి చూపించరు. అలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకుని నిలబడే వాళ్లలో పూరి జగన్నాధ్ పేరు ముందు వరసలో ఉంటుంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ రెండూ భారీ దెబ్బేశాయి. దర్శకత్వం పరంగానే కాదు నిర్మాణం కూడా తనదే కావడంతో నష్టం ఒత్తిడి తీవ్ర స్థాయిలో పడింది. అయినా సరే గాయం నుంచి త్వరగా కోలుకుని కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. తమిళ హీరో విజయ్ సేతుపతిని మెప్పించగలిగాడు. ఒక కీలక పాత్రకు టబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
హీరోయిన్ గా రాధికా ఆప్టే ఎస్ చెప్పిందని లేటెస్ట్ అప్డేట్. ఇదంతా చూస్తుంటే పూరి రెగ్యులర్ రూట్ లో వెళ్లడం లేదని అర్థమవుతోంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ డైరెక్టర్ ట్రాక్ రికార్డు చూసి తానీ సినిమా ఒప్పుకోలేదని, నటుడిగా ఛాలెంజ్ అనిపించే స్కోప్ ఉంది కాబట్టి అంగీకరించానని వివరించారు. అంటే పూరి ఎప్పుడూ చూపించే మాఫియా, దుబాయ్, డ్రగ్స్ కాకుండా ఏదో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడన్న మాట. బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది కానీ దీన్ని ఫైనల్ చేయకపోవచ్చని పూరి టీమ్ నుంచి వినిపిస్తున్న మాట.
స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకున్న పూరి జగన్నాధ్ స్పీడ్ విషయంలో మాత్రం తన స్టైల్ ఫాలో కాబోతున్నాడు. వేగంగా షూటింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్స్ వేస్తున్నారట. సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలనే ఆలోచన ఒక కొలిక్కి రాలేదని టాక్. మణిశర్మతో పనవ్వడం లేదు. దేవి, తమన్ లు తన వేగానికి వర్క్ చేయడం కష్టం. అందుకే జివి ప్రకాష్, సంతోష్ నారాయణన్ లాంటి కొత్త ఆప్షన్లు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒకరకంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ కి ఈ సినిమా డూ ఆర్ డై లాంటిది. హిట్ కొడితే సెకండ్ ఇన్నింగ్స్ బ్రహ్మాండంగా కొనసాగించవచ్చు. అభిమానులే కాదు మూవీ లవర్స్ కోరుకుంటున్నది ఇదే.