దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’ లాంటి ఎంటర్టైనర్గా దర్శకుడిగా పరిచయం అయన దేవా.. ‘ప్రస్థానం’తో గొప్ప దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. ఆ చిత్రంలో ముఖ్య పాత్రలను తీర్చిదిద్దిన తీరు.. ఎంతో లోతైన అర్థంతో సాగిన సంభాషణలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పటికీ ‘ప్రస్థానం’ డైలాగుల గురించి జనం మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్లాప్ సినిమాలైన ‘ఆటోనగర్ సూర్య’, ‘రిపబ్లిక్’లోనూ డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. దేవాలోని ఈ ప్రతిభే దర్శక ధీరుడు రాజమౌళిని సైతం అమితంగా ఆకట్టుకుంది. అందుకే ‘బాహుబలి’ లాంటి మెగా మూవీ కోసం దేవా సాయం తీసుకున్నాడు.
అందులో యుద్ధ భూమిలో నైరాశ్యంలో ఉన్న సహచరుల్లో ధైర్యాన్ని నింపుతూ ప్రభాస్ చెప్పే ‘మరణం’ డైలాగ్స్ రాసింది దేవానే అన్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ వెబ్ సిరీస్ మీద కూడా దేవా.. జక్కన్నతో కలిసి పని చేశాడు. తాజా సమాచారం ఏంటంటే.. రాజమౌళి కొత్త చిత్రానికి దేవా పూర్తి స్థాయిలో మాటలు రాస్తున్నాడట. మహేష్ బాబు హీరోగా రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం.. కొన్ని నెలల కిందటే సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీని తెలుగు వెర్షన్కు దేవానే డైలాగులు రాస్తున్నాడట.
మంచి సినిమా అయినప్పటికీ కమర్షియల్గా ‘రిపబ్లిక్’ ఫెయిలవడంతో దేవాకు ఇంకో సినిమా చేసే అవకాశం రాలేదు. కొంత కాలంగా ఖాళీగానే ఉన్నాడు. ఇదే టైంలో రాజమౌళి.. మహేష్ సినిమాకు డైలాగులు రాయమని అడగడంతో ఓకే చెప్పి ఆ పని పూర్తి చేసేశాడట దేవా. ఈ సినిమాకు వేరే రైటర్లు కూడా పని చేస్తున్నారు. మెజారిటీ డైలాగ్స్ దేవావే తీసుకునే అవకాశాలున్నాయి. బాగా నచ్చిన డైలాగులను వేరే భాషల్లోకి కూడా అనువాదం చేయించొచ్చు. ఈసారి జస్ట్ థ్యాంక్స్ కార్డ్ వేయడం కాకుండా.. రచయితగా దేవాకు సినిమాలో క్రెడిట్ ఇవ్వబోతున్నాడట జక్కన్న.