వందేళ్ల ఆస్కార్ ఎదురుచూవు – రాజమౌళి కొత్త టార్గెట్

ప్రపంచవ్యాప్తంగా మూవీ మేకర్స్ కలగా, జీవిత లక్ష్యంగా భావించే ఆస్కార్ అవార్డులు 2028తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఈ సందర్భంగా స్టంట్ డిజైన్ అనే కొత్త విభాగంలో పురస్కారాలు ఇవ్వబోతున్నట్టు అకాడెమి అధికారికంగా ప్రకటించింది. ఎక్స్ లో పోస్ట్ చేసిన ఇమేజ్ లో ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ పులి మీద దూకే షాట్ ని పొందుపర్చడంతో జక్కన్న పనితనం వాళ్ళను ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. పది దశాబ్దాలుగా ఆస్కార్ లో స్టంట్స్ కి సంబంధించిన అవార్డు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా ఇది నిజం.

దీనికి రాజమౌళి స్పందించారు. 2027లో విడుదల కాబోతున్న సినిమాలకు స్టంట్స్ విభాగంలో అవార్డు ఇవ్వబోతున్నట్టు తెలిసి సంతోషం వ్యక్తం చేస్తూ అకాడమీ కీలక సభ్యులకు పేర్లతో సహా ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ జక్కన్నకు కొత్త టార్గెట్స్ మొదలయ్యాయి. వాటిలో మొదటిది ఎస్ఎస్ఎంబి 29 ఇంకో రెండేళ్లలో రిలీజ్ చేయడం. ఆర్ఆర్ఆర్ వచ్చిన మార్చి 27నే  2027లో విడుదల చేయబోతున్నట్టు వినిపిస్తున్న వార్త నిజమే అయితే కనక మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగే. యాక్షన్ ఎపిసోడ్లకు పెద్ద పీఠ వేస్తున్నారు కాబట్టి జక్కన్న మరింత జాగ్రత్తగా ఉంటారు. బడ్జెట్ విషయంలో ఎలాగూ రాజీ ఉండదు.

కేవలం యాక్షన్ పరంగానే కాదు ఈసారి రాజమౌళి లక్ష్యాలు అన్ని డిపార్ట్ మెంట్స్ ని టార్గెట్ చేసుకుంటాయి. నిజానికి ట్రిపులార్ కు ఆయన ఆశించింది నాటు నాటు పాటకు కాదు. సాంకేతికంగా ఇతర విభాగాలకు వస్తుందని కష్టపడ్డారు. కానీ సంగీతానికి దక్కింది. అది కూడా తన కష్టమే కాబట్టి సంతోషమే అయినా జక్కన్న పనితనానికి కూడా ఆస్కార్ గుర్తింపు వస్తే ఆ కిక్కు వేరే ఉంటుంది. ఎస్ఎస్ఎంబి 29 ఎలాగూ గ్లోబల్ ఆడియన్స్ కి విపరీతంగా కనెక్టయ్యే ఫారెస్ట్ అడ్వెంచర్. దానికి ఎమోషన్, ఎలివేషన్ జోడించి రాజమౌళి నెక్స్ట్ లెవెల్ లో తీస్తారు కాబట్టి ఈసారి వసూళ్లు వెయ్యి కోట్లు కాదు రెండు మూడు వేల కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.