అంతా సిద్దమనుకుని ఇంకాసేపట్లో షోలు పడతాయన్న టైంలో హఠాత్తుగా విడుదల ఆగిపోతే ఆ నిర్మాతలు పడే నరకం అంతా ఇంతా కాదు. ఇవాళ రిలీజైన వీర ధీర శూర పార్ట్ 2 మార్నింగ్ షోలు క్యాన్సిల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు ఖంగారు పడ్డారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ బి4యు కోర్టులో దాఖలు చేసిన కేసు వల్ల చివరి నిమిషంలో ఇలా జరగడంతో ఉదయం, మధ్యాన్నం టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు రీ ఫండ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఏడు కోట్లు చెల్లిస్తేనే మార్గం సుగమం అవుతుందని ముంబై న్యాయస్థానం చెప్పడంతో వ్యవహారం తేలదేమో అనుకున్నారు. ఎట్టకేలకు శుభం కార్డు పడింది.
మధ్యాన్నం నాలుగు గంటల నుంచి క్రమంగా షోలు మొదలయ్యాయి. దీని వల్ల ఓపెనింగ్స్ బాగా దెబ్బ తిన్నాయి. ఆలస్యంగా అప్డేట్ రావడంతో అప్పటికప్పుడు థియేటర్లు బుకింగ్స్ ని ఆన్ లైన్ లో అప్డేట్ చేసినప్పటికి సడన్ ప్లానింగ్ చేసుకోలేక డ్రాప్ అయిపోయిన ప్రేక్షకులు వేలు, లక్షల్లో ఉంటారు. ఉదయం విషయం తెలిసిన వెంటనే హీరో విక్రమ్, ఎస్జె సూర్యలు తమ పారితోషికం తగ్గించుకుని మరీ సహకరించేందుకు ముందుకు వచ్చారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో రేపో ఎల్లుండో ఏదైనా ప్రెస్ మీట్ పెడితే తప్ప స్పష్టత రాదు. ఏదైతేనేం సాయంత్రం, నైట్ షోలు జరిగిపోయాయి.
ఇలాంటి ఉదంతాలు కొత్త కాదు. తమిళంలోనే కాదు టాలీవుడ్ లోనూ జరిగాయి. దీనికి ఎవరు భాద్యులు అనే ప్రశ్న కన్నా ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలనే దాని మీద ప్రొడ్యూసర్లు దృష్టి పెట్టాలి. అసలే ఈ రోజు ఎల్2 ఎంపురాన్ తో పోటీ వల్ల వీరధీరశూరకు ఓపెనింగ్స్ పరంగా దెబ్బ పడింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇలాంటి పరిణామాల వల్ల నిర్మాత నుంచి బయ్యర్ల దాకా అందరూ నష్టపోతారు. షేర్లు పోతాయి. పోటీదారులు లాభపడతారు. మరి టాక్ పాజిటివ్ గా వస్తే ఈ వీరధీరశూర హమ్మయ్య అనుకోవచ్చు. అదేంటో రాత్రిలోగా తెలిసిపోతుంది. చూడాలి ఏ తీర్పు వస్తుందో.