ఇప్పట్లో మొదలవ్వకపోయినా అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ గురించి అప్పుడే ఓ రేంజ్ అంచనాలు నెలకొంటున్నాయి. ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో రూపంలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ ద్వయం నాలుగోసారి చేతులు కలపడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటిదాకా ఫ్యామిలీ జానర్ లోనే ఉంటూ వచ్చిన మాటల మాంత్రికుడు ఈసారి ఫాంటసీ జానర్ ని టచ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే నిర్మాత నాగవంశీ ఇస్తున్న అప్డేట్లు ఓ రేంజ్ ఎలివేషన్లిస్తున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రామాయణ, మహాభారత గాథల్లో వీరుల గురించి ఎందరో ఎన్నో సినిమాల్లో చూపించారని, కానీ తెలిసినా ఎక్కువ లోతుగా అధ్యయనం జరగని ఒక అద్భుత వీరుడిని ఇందులో చూపించబోతున్నామని హింట్ ఇవ్వడం హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లేలా ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దేవుడు కార్తికేయని స్ఫూర్తిగా తీసుకుని ఒక డిఫరెంట్ సబ్జెక్టుని తయారు చేసుకున్నట్టు వినికిడి. నిజంగానే ఇప్పటిదాకా కార్తికేయుడి మీద సినిమాలు తీసిన దర్శకులు పెద్దగా లేరు. టైటిల్స్ పెట్టుకున్నారు కానీ ఆయన గాథ ఎక్కువ తెలిసింది తమిళులకే.
ఇది నిజమైతే మాత్రం బన్నీని సరికొత్తగా చూడొచ్చన్న మాట. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం సిద్ధమవుతున్న అల్లు అర్జున్ వేసవి నుంచి దాని షూటింగ్ మొదలుపెట్టేలా చూస్తున్నాడు. పుట్టినరోజు ఏప్రిల్ 8 అనౌన్స్ మెంట్ రావొచ్చని టాక్ ఉంది కానీ నాన్నమ్మ అనారోగ్యం దృష్ట్యా ఏ మేరకు చేయగలరనేది చూడాలి. త్రివిక్రమ్ ఇంకో ఆరు నెలల్లో తన ఫైనల్ వెర్షన్ ని సిద్ధం చేస్తారని తెలిసింది. క్యాస్టింగ్ ఇతరత్రా ప్రీ ప్రొడక్షన్ పనులు మెల్లగా జరుగుతున్నాయి. కెరీర్ లో మొదటిసారి పురాణగాథను టచ్ చేయబోతున్న త్రివిక్రమ్ బన్నీలు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తారో వేచి చూడాలి. టైం చాలానే పడుతుంది.