మే 30 విడుదల కాబోతున్న కింగ్ డమ్ కౌంట్ డౌన్ ఇంకో అరవై ఏడు రోజులు మాత్రమే ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మీద నాగవంశీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మరోసారి శ్రీలంకకు వెళ్తోంది. ఒక సాంగ్ షూట్ కోసం అయిదు రోజులు అక్కడే ఉండి పూర్తి చేసుకుని వస్తుంది. ఇది గ్రూప్ సాంగని ఇన్ సైడ్ టాక్. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన హై ఎమోషనల్ సాంగ్ ని భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో అవుట్ డోర్, సెట్స్ లో తీయబోతున్నట్టు సమాచారం.
ఇన్నిసార్లు కింగ్ డమ్ శ్రీలంకలో షూటింగ్ జరుపుకోవడానికి అసలు కారణం దీని నేపధ్యమే అని తెలిసిన విషయమే అయినా మరికొన్ని కీలక లీక్స్ ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఒకప్పుడు శ్రీలంకలో తమిళనాడు శరణార్థులది పెద్ద చరిత్ర. వీళ్ళ కోసమే ఎల్టిటిఐ స్థాపించి తీవ్రవాదాన్ని పెంచి పోషించిన ప్రభాకరన్ కొన్ని లక్షల మందికి ఆరాధ్యుడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు దారి తీసిన పరిస్థితులకు మూలం శ్రీలంక నుంచే మొదలయ్యింది. కింగ్ డమ్ లో ఈ నిజజీవిత సంఘటనలు కొన్ని తీసుకుని అణిచివేయబడుతున్న తెగల నాయకుడిగా విజయ్ దేవరకొండ ఉద్భవించే వైనం టెర్రిఫిక్ గా ఉంటుందట.
ఇక్కడ చెప్పింది చాలా కొంతే కానీ స్క్రీన్ మీద ఊహించని స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. రెండు భాగాలనే ప్రచారం ముందు నుంచి ఉంది కానీ ఫలితం బట్టి ఈ నిర్ణయంలో మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు. అయితే కంటెంట్, లాజిక్స్, యాక్షన్, గ్రాండియర్ ఇలా అన్ని టిక్ బాక్సులకు సమాధానం ఇచ్చే స్థాయిలో కింగ్ డమ్ ఉంటుందని నాగవంశీ పదే పదే చెప్పడం చూసి ఫ్యాన్స్ చాలా నమ్మకం పెట్టేసుకున్నారు. ఏప్రిల్ రెండో వారంలో ప్రమోషన్లు ప్లాన్ చేస్తారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రోగ్రాంలు, టూర్లు చాలానే ఉంటాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్రీలంకలో చేసే ఛాన్స్ ఉంది.