నిన్న ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిదికి పైగా కొత్త రిలీజులు మూకుమ్మడిగా బాక్సాఫీస్ మీద దాడి చేశాయి. ఒక్కదానికి కనీస స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. అంతో ఇంతో ప్రమోషన్లు చేసుకున్న సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ సైతం నిరాశాజనకంగానే సాగుతోంది. ఏదో కొన్ని సెంటర్లలో కాసింత వసూళ్లు కనిపించాయి కానీ మిగిలిన చోట్ల మాత్రం కనీసం ఖర్చులు కిట్టుబాటు అయ్యే ఆక్యుపెన్సీ లేదని ట్రేడ్ వర్గాల టాక్. హిట్లు లేకపోయినా గుర్తింపున్న ఆది సాయికుమార్ షణ్ముఖలో కాసింత డిఫరెంట్ కంటెంట్ అనిపించినప్పటికీ చూసిన కొద్దిపాటి జనాలను మెప్పించలేకపోయిందని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి.
ఇక మిగిలిన వాటి పేర్లు చెప్పుకుంటూ వాటికేమైందో వివరిస్తూ పోతే ఒకటే మ్యాటర్ రిపీటవుతుంది. పరిస్థితి ఎంత ట్రాజెడీగా ఉందంటే కొత్తవాటికి జనం లేక అలో లక్ష్మణా అంటుంటే సలార్ రీ రిలీజ్ ఏకంగా మూడు కోట్లకు పైగా ఎగరేసుకుపోయింది. అది కూడా ఒక్క రోజుకే. వీకెండ్ కూడా బాగుండేలా కనిపిస్తోంది. ఎవడే సుబ్రహ్మణ్యంని జనం లైట్ తీసుకున్నారు. ఇక హైదరాబాద్ మూవీ లవర్స్ రెడ్ లారీ ఫెస్టివల్ జరుగుతున్న ప్రసాద్ మల్టీప్లెక్స్ లో పాత సినిమాలు చూసే హడావిడిలో ఉండగా మొన్న వీక్ డేస్ లో కాస్త నెమ్మదించిన కోర్ట్ తిరిగి వేగం పుంజుకుంది. శని ఆదివారాలు ఇదే బెస్ట్ ఛాయస్ కానుంది.
బాక్సాఫీస్ కు కీలకమైన శుక్రవారాలు ఇంత డ్రైగా ఉండటం బాధ కలిగించే విషయం. అందులోనూ ఇన్నేసి సినిమాలు వచ్చినా హౌస్ ఫుల్స్ కనిపించకపోవడం విచారకరం. వచ్చే వారం ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2, మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ వస్తున్న నేపథ్యంలో జనం వాటిని చూడటం కోసం ఈ వీక్ మౌనంగా ఉండటం థియేటర్లను ఖాళీగా ఉంచేసింది. ఇప్పుడు బయ్యర్ల ఆశలన్నీ వాటి మీదే ఉన్నాయి. స్కూల్ పిల్లల పరీక్షలు అయిపోయి సెలవుల్లో ఉన్నారు. సరైన సినిమా పడితే తల్లితండ్రులతో కలిపి టికెట్లు తెంపుతారు. యూత్, మాస్ తమకు నచ్చే కంటెంట్ వస్తే నెత్తినబెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.