పోకిరి, ఇడియట్, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఒకప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ గా ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో మళ్ళీ కంబ్యాక్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. ఈ క్రమంలో పలువురు హీరోలను కలుస్తూ కథలు వినిపించే ప్రయత్నంలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్ వినిపించింది. అఖిల్, నాగార్జున అంటూ ఏవేవో పేర్లు వినిపించాయి కానీ పూరి ఎవరిని కలిశాడనేది ఖచ్చితంగా తెలియలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ కు ఎట్టకేలకు ఒక హీరో దొరికాడు. అది కూడా ఆషామాషి యాక్టర్ కాదు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.
అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ దాదాపు ఈ కాంబో సెట్టయిపోయిందని చెన్నై న్యూస్. అనౌన్స్ మెంట్, నిర్మాత తాలూకు వివరాలు, జానర్ తదితరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది నిజమైతే పూరి జాక్ పాట్ కొట్టినట్టే. ఎందుకంటే విజయ్ సేతుపతికి తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉంది. ఉప్పెన, మహారాజ లాంటి సక్సెస్ లు తన స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఇప్పుడు పూరి డిజైన్ చేసే క్యారెక్టరైజేషన్లో అతను ఎలా కనిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మాఫియా, డ్రగ్స్ లాంటి రెగ్యులర్ బ్యాక్ డ్రాప్ కాకుండా ఒక క్రైమ్ తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్ ని పూరి జగన్నాథ్ సిద్ధం చేసుకున్నట్టుగా వినికిడి.
నిజానికి ఉప్పెన తర్వాత విజయ్ సేతుపతిని ఒప్పించేందుకు టాలీవుడ్ దర్శకులు చాలానే కలిశారు. కానీ కథలు తనకు నచ్చకపోవడం వల్లే అంగీకరించలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం చూశాం. మరి పూరికి గ్రీన్ సిగ్నల్ అంటే ఏదో పవర్ ఫుల్ స్టోరీనే సెట్ అయ్యిందన్న మాట. కసి మీదున్న పూరి జగన్నాధ్ కు అర్జెంట్ గా ఒక పెద్ద హిట్టు కావాలి. రెండు ఫ్లాపులు మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసిన సమయంలో తానేంటో మరోసారి ఋజువు చేస్తే అవకాశాలు క్యూ కడతాయని ఫ్యాన్స్ ఇప్పటికీ నమ్ముతున్నారు. నేనింతేలో రవితేజతో చెప్పించినట్టు గెలిచినా ఓడినా పూరి లాంటి మేకర్స్ కు సినిమాలే ప్రపంచం.