మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ భాగస్వామిగా లైకా ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారాలు చిక్కుగా మారి అసలు చెప్పిన డేట్ కి రిలీజ్ అవుతుందా లేదానే అనుమానాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు ప్రముఖ నిర్మాణ సంస్థ గోకులన్ రంగప్రవేశం చేయడంతో సమస్య కొలిక్కి వచ్చి దారి క్లియరయ్యింది. వరస డిజాస్టర్లతో కుదేలైన లైకా ఎల్2 తో గట్టెక్కవచ్చు అనుకుంటే ఇతరత్రా మార్గాల్లో వివాదాలు చుట్టముట్టడంతో మరొకరి సహాయం తీసుకోక తప్పలేదు. ఇప్పుడు గోకులన్, ఆశీర్వాద్, లైకాలు సంయుక్తంగా తీసుకొస్తున్నాయి.
మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ ఎల్2 ఎంపురాన్ కు గ్రాండ్ రిలీజ్ దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఉదయం 6 గంటల నుంచే బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు. కేరళకు చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో సైతం ప్రీమియర్లంటే కంటెంట్ మీద ఓ రేంజ్ నమ్మకం ఉన్నట్టే. ఇక్కడితో అయిపోలేదు. 2019 లో వచ్చిన మొదటి భాగం లూసిఫర్ ని మార్చి 20 మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. దీన్నే చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసుకోవడం తెలిసిందే. కాకపోతే ఒరిజినల్ వెర్షన్ స్థాయిలో మేజిక్ చేయలేక ఇక్కడ జస్ట్ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.
సో ఇప్పటిదాకా బజ్ తక్కువగా ఉన్న ఎల్2 కి ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు. అసలే పోటీ ఎక్కువగా ఉంది. అదే రోజు విక్రమ్ వీరధీర శూర పార్ట్ 2 వస్తుండగా మరుసటి రోజు నితిన్ రాబిన్ హుడ్, సితార మ్యాడ్ స్క్వేర్ రంగంలోకి దిగుతున్నాయి. సో మొత్తం నాలుగు సినిమాల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొనబోతోంది. అయితే ఎల్2 గురించి మల్లువుడ్ వర్గాల్లో పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. దీనికి దర్శకత్వం వహించిన పృథ్విరాజ్ సుకుమారన్ అలియాస్ సలార్ విలన్ తెలుగులో ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ వస్తున్నాడట. ఎస్ఎస్ఎంబి 29లో తనో కీలక పాత్ర చేయడం అంచనాలు పెంచుతోంది.