ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో ఒక బ్రేక్ పడుతూనే ఉంది. ఇప్పటిదాకా సుమారు పద్నాలుగు కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ టాక్. దీని ఇండియా వైడ్ రేంజ్ కి ఇది కొంచెం తక్కువే అయినా డబ్బింగ్ అందులోనూ మరాఠి వీరుడి కథకి టాలీవుడ్లో ఇంత ఆదరణ దక్కడం విశేషమే. అయితే రిలీజ్ టైంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రూపంలో కలెక్షన్లు కొంత ప్రభావితం కాగా తాజాగా కోర్ట్ చూపిస్తున్న జోరు ఛావాకు ఇంకో ప్రతిబంధకంగా మారింది. ఆడియన్స్ కి మరో ఛాయస్ దొరకడంతో షిఫ్ట్ అయిపోతున్నారు.

సో ఛావా ఫైనల్ రన్ కు దగ్గరగా ఉన్నట్టే. దేశవ్యాప్తంగా ఏడు వందల కోట్లు వసూలు దాటేసిన ఈ హిస్టారికల్ డ్రామా సహస్రం అందుకుంటుందా లేదానే దాని గురించి బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఛావా ఇప్పటికీ నెమ్మదించలేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఏకంగా పుష్ప 2ని దాటేసి సరికొత్త బెంచ్ మార్కులు సృష్టించింది. ఢిల్లీ, ముంబై సర్క్యూట్స్ లో కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. తెలుగు నుంచి కనీసం ఒక యాభై కోట్ల గ్రాస్ ని నిర్మాతలు ఆశించారు కానీ ఇప్పుడది నెరవేరే సూచనలు తగ్గిపోయాయి. పాతిక కోట్లను అందుకోవడమే అచీవ్ మెంటని చెప్పొచ్చు.

నెమ్మదించిన సంగతి పక్కనపెడితే ఛావాకు మార్చ్ 26 దాకా ఛాన్స్ ఉంది. మధ్యలో చెప్పుకోదగ్గ రిలీజులేం లేవు. కోర్ట్ నిలబడింది కానీ కిరణ్ అబ్బవరం దిల్ రుబాకు వస్తున్న స్పందన చూస్తుంటే దాన్ని కొంతమేరకు ఛావా వాడుకోవచ్చు. పంపిణి చేస్తున్న గీత ఆర్ట్స్ ప్రమోషన్స్ ఆపేసింది. ఎలాగూ జనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి కొత్తగా హంగామా చేయాల్సిన పని లేదన్న ఉద్దేశంతో సైలెంటయ్యింది. పరీక్షల సీజన్ కావడం కూడా ఛావాకు ఒక అడ్డంకి. పిల్లలను థియేటర్లకు దూరంగా ఉంచిన తల్లితండ్రులు తాము కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీని వల్ల ఛావా రీచ్ మీద ప్రభావం పడిందన్నది వాస్తవం.