సీతమ్మ వాకిట్లో.. నాగ్ వాకిట నుంచే

ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం ఇండస్ట్రీలో సహజమే. కొన్ని సినిమాలు చేయనందుకు హీరోలు రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో కొన్ని చిత్రాల నుంచి భలే తప్పించుకున్నామని సంబర పడే సందర్భాలూ ఎదురువుతాయి. ప్రస్తుతం రీ రిలీజ్‌తో సందడి చేస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం అసలు మహష్ బాబు-వెంకటేష్‌లతో చేయాల్సిందే కాదట. ఈ కథకు ముందు అనుకున్నది అక్కినేని నాగార్జుననట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

శ్రీకాంత్ అడ్డాల ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దాని తర్వాత నాగార్జునతో సినిమా చేయడానికి తనకు అవకాశం వచ్చిందని.. అప్పుడే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కథ పుట్టిందని శ్రీకాంత్ వెల్లడించాడు. ‘‘కొత్త బంగారు లోకం సినిమా తర్వాత నేను గోదావరి ప్రాంతంలోని మా ఊరికి బయల్దేరాను. విజయవాడలో దుర్గ గుడి దాటుతుండగా ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ గారు ఫోన్ చేశారు. నాగార్జున గారికి ఏమైనా కథ ఉందా అని అడిగారు. ఆయనతో చేస్తే ఎలాంటి కథ చేయాలి అని ఆలోచన మొదలైంది. రెండు రోజులకే తిరిగి హైదరాబాద్‌కు వచ్చాను.

కుటుంబ నేపథ్యంలో ఒక అన్నదమ్ముల కథ చేద్దాం అనుకున్నా. నాగార్జున గారిని కలిసి బేసిక్ స్టోరీ లైన్ చెప్పాను. మల్టీస్టారర్ సినిమా ఇదని కూడా తెలిపాను. కానీ కొన్ని రోజుల తర్వాత మార్తాండ్ గారే ఫోన్ చేసి సురేస్ బాబు గారు వెంకటేష్ కోసం ఒక సినిమా చేయమంటున్నారన్నారు. నేను వెళ్తే సురేష్ గారు, వెంకటేష్ గారు ఇద్దరూ కలిసి మాట్లాడారు. అప్పుడు ఇదే కథ లైన్ చెప్పాను. ‘‘ఒక మంచి కుటుంబాన్ని సమాజానికి ఇస్తే అంతకుమించి మనం చేసే మంచి ఇంకేదీ ఉండదు’’ అనే కాన్సెప్ట్ కూడా చెప్పాను. వాళ్లిద్దరికీ కాన్సెప్ట్ నచ్చి ఈ కథ ముందుకు కదిలింది’’ అని శ్రీకాంత్ తెలిపాడు.