సలార్ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. 2025 దీనికే అంకితం కానుంది. ఎలాంటి అవాంతరాలు, అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే 2026 సంక్రాంతి బరిలో విడుదల చేయడం ఖాయమే. అయితే దీని తర్వాత నీల్ ఎవరితో సినిమా చేస్తాడనే దాని మీద రకరకాల ఊహాగానాలు రేగుతున్న నేపథ్యంలో ప్రాక్టికల్ కోణంలో ఆలోచిస్తే ఎందుకు సులభంగా దొరకడో అర్థమవుతుంది. తారక్ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్ ఫోకస్ సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం వైపు వెళ్ళిపోతుంది.
దానికో ఏడాదిన్నర వేసుకుంటే రిలీజ్ నాటికి 2027 వస్తుంది. ఆ తర్వాత కెజిఎఫ్ 3 తెరకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యష్ టాక్సిక్ తర్వాత ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అసలు కథలు కూడా వినడం లేదట. కేవలం నీల్ కోసమే వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు బెంగళూరు టాక్. అదే నిజమైన పక్షంలో మొత్తం మూడు సినిమాలు డ్రాగన్, సలార్ 2, కెజిఎఫ్ 3 కి ఎంత లేదన్నా అయిదేళ్ళు గడిచిపోతాయి. ఇక్కడితో అయిపోలేదు. డివివి దానయ్యతో రామ్ చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ ఒక కమిట్ మెంట్ ఇచ్చాడనే టాక్ ఉంది. నిర్ధారణ చేయలేదు కానీ ఇన్ సైడ్ న్యూస్ బలంగా ఉన్నాయి.
సో ఇంకెవరికి కెజిఎఫ్ దర్శకుడితో ఇప్పట్లో కాంబో లేనట్టే. ఒకవేళ తారక్ మూవీ కనక అనుకున్న టైంలో అవ్వకపోతే పైన చెప్పిన లిస్టుకి మరింత ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడ చెప్పిన కారణాల వల్లే బాలీవుడ్ నుంచి ఆఫర్లు ఎన్ని వస్తున్నా ప్రశాంత్ నీల్ సున్నితంగా నో చెప్పేస్తున్నాడట. ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కు రెట్టింపు ఇస్తామన్నా తిరస్కరించినట్టు తెలిసింది. కెరీర్ లో నాలుగో సినిమాకే ఇంత డిమాండ్ సృష్టించుకున్న శాండల్ వుడ్ దర్శకుల్లో ప్రశాంత్ నీల్ దే అగ్ర స్థానం. ఇంకా చెప్పాలంటే రాజమౌళి, సుకుమార్ తర్వాత పేరు తనదే వినిపించేంత స్థాయికి చేరుకున్నాడు.