సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకున్న కంగువకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పరాభవం దక్కిందో చూశాం. హీరో ఏమో కానీ ఆయన భార్య జ్యోతిక మాత్రం దీన్ని బ్యాడ్ మూవీ అనేందుకు ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. సౌత్ లో ఎన్నో చెత్త సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచి వసూళ్లు సాధించాయని, వాటితో పోలిస్తే కంగువా చాలా నయమని, కానీ దారుణమైన రివ్యూలతో మీడియా అన్యాయం చేసిందని వాపోవడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొంత భాగం కనెక్ట్ కాని మాట నిజమే కానీ కంగువ టీమ్ ఎంత కష్టపడి ఉందో తనకు తెలుసంటూ వివరించింది.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే జ్యోతిక నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యింది. దాని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగువ ప్రస్తావన వచ్చింది. అయితే ఆవిడ మిస్ అవుతున్న లాజిక్ ఒకటుంది. రివ్యూలు ఎలా వచ్చినా నిజంగా కంటెంట్ లో దమ్ముంటే ఆడియన్స్ ఏవీ పట్టించుకోకుండా థియేటర్లకు వస్తారని ఎన్నో సందర్భాల్లో ఋజువయ్యింది. పైగా కోట్లు ఖర్చు పెట్టారు, కష్టపడ్డారు అనే సింపతీ మీద జనం టికెట్లు కొనరు. తమ డబ్బుకు న్యాయం జరుగుతుందని భావిస్తేనే వస్తారు. లేదంటే ఎంత పెద్ద స్టార్ అయినా ట్రీట్ మెంట్ ఇలాగే ఉంటుంది.
మరో గమనించాల్సిన విషయం ఏంటంటే కంగువ లాగే గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు కూడా ఇదే తరహా ఫలితం అందుకున్నాయి. కానీ ఆయా దర్శక నిర్మాతలు, దానికి సంబంధించిన వాళ్ళు ఎలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వలేదు సరికదా రిజల్ట్ గుర్తించి సైలెంట్ అయ్యారు. కంగువకు ఎన్ని కోట్లు అయ్యాయనే దానికన్నా పొరపాటు ఎక్కడ జరిగిందనేది గుర్తిస్తే ఇకపై మరింత జాగ్రత్తగా ఉండొచ్చు. అంతే తప్ప రివ్యూలు, టాకులు ఒక పెద్ద హీరో సినిమాని చంపేయడం ఎక్కడా ఉండదు. సూర్య కొత్త సినిమా రెట్రో మే 1 విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనికెలాంటి రిజల్ట్ వస్తుందో.