అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానయ్యకు ఇది రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన ఉందట. దానికి అనుగుణంగానే స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారని, ఇది డెవలప్ చేసే క్రమంలో గూఢచారి అడివి శేష్ సహకారం అందించాడనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా ఉంది. అసలు అకీరానందన్ ను దీంతోనే డెబ్యూ చేయించాలనే ఆలోచన తనదేనట. అయితే పవన్ వద్దని వరించడంతో ఒక ముఖ్యమైన క్యామియోకి రామ్ చరణ్ ని అడిగే ప్రతిపాదన నెలల క్రితమే జరిగింది.
అయితే ఇక్కడ కొన్ని చిక్కులున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం పాలన, అభివృద్ధి, రాజకీయం మీదే ఉన్నాయి. అర్జెంట్ గా సినిమాలు చేయాలని, కథలు వినాలనే తాపత్రయం కానీ లేదు. కమిటైనవి పూర్తి చేస్తే చాలానే ధోరణిలో ఉన్నారు. అలాంటప్పుడు ఓజి 2 సాధ్యాసాధ్యాల గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. ఎందుకంటే హరిహర వీరమల్లు సైతం రెండు భాగాలుగా వస్తోంది. దీనికి టైం ఇవ్వడమే పవన్ కు మహా కష్టంగా మారింది. అలాంటిది ఓజి 2 కోసం ఇంకాస్త ఎక్కువ సమయం కేటాయించడమంటే అంత సులభం కాకపోవచ్చు.
సో ప్రస్తుతానికి ఇది నిజమా కాదానేది పక్కనపెడితే ఓజి 2 వార్త వాస్తవమే అయితే ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇదంతా ఓకే కానీ హరిహర వీరమల్లు మార్చి 28 నుంచి వాయిదా పడ్డాక ఇంకా కొత్త డేట్ ప్రకటించలేదు. ఏప్రిల్ లో రావడం కూడా అనుమానమే. నిర్మాత ఏఎం రత్నం మే, జూన్ ఆప్షన్లు చూస్తున్నారు. ఎంత త్వరగా తీసుకురావాలని చూస్తున్నా అంతకంతా ఆలస్యమవుతున్న ఈ హిస్టారికల్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇది డేట్ ఫిక్స్ చేసుకున్నాకే ఓజిని ఎప్పుడు వదలాలనే నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా ఇదంతా సస్పెన్సే.