ఒకపక్క హరిహర వీరమల్లు మార్చి 28 విడుదల తేదీని మళ్ళీ వాయిదా వేసుకోవడం అభిమానులను టెన్షన్ కలిగిస్తుండగా ఇంకోవైపు తాము ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజి షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం వాళ్ళ ఆందోళనను మరింత పెంచుతోంది. వీరమల్లులో పవన్ కళ్యాణ్ లేని సీన్లను ఇటీవలే దర్శకుడు జ్యోతికృష్ణ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇంకొంచెం ప్యాచ్ వర్క్ కి పవర్ స్టార్ ఓ అయిదారు రోజుల డేట్స్ ఇస్తే మొత్తం పూర్తయిపోతుందట. అంతా అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ చివరి వారం లేదా మే ఫస్ట్ వీక్ రిలీజ్ కు అవకాశముంది. ఇంతకన్నా లేట్ అయితే జూలైకి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
ఇది రిలీజైతే తప్ప ఓజి ముందుకు కదలదు. ఇది కూడా మరీ ఎక్కువ బ్యాలన్స్ లేదు. కాకపోతే రెండు సమాంతరంగా షూట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే హెయిర్ స్టైల్స్ వేరు వేరు కాబట్టి ముందొకటి కంప్లీట్ చేస్తే తప్ప రెండో సెట్లో పవన్ అడుగు పెట్టలేరు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఓజి ఈ సంవత్సరమే థియేటర్ రిలీజవుతుందని నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం జరిగిందట. దానికి అనుగుణంగా రేట్ మాట్లాడుకుని హక్కులు అమ్మినట్టు సమాచారం. ఒకవేళ 2026కి వెళ్లాల్సి వస్తే ఒప్పుకున్న మొత్తంలో నిర్మాతకు కోత పడే ప్రమాదముంది. అందుకే దసరా లేదా దీపావళి అదీ కుదరదంటే క్రిస్మస్ కైనా విడుదల చేయాలని చూస్తున్నారు.
సో రెండూ ఒకదానికొకటి ముడిపడినవి కావడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. వీటితో పోలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంత ప్రెజర్ లేదు. దర్శకుడు హరీష్ శంకర్ ఆల్రెడీ రామ్, బాలకృష్ణలను కలుసుకుని ఏదో ఒక సినిమా ఓకే చేయించుకునే పనిలో ఉన్నాడు. ఒకవేళ పవన్ నుంచి పిలుపు వస్తే ఆఘమేఘాల మీద పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటొచ్చి హరిహర వీరమల్లు, ఓజి సందిగ్ధం తొలిగితే తప్ప భగత్ సింగ్ కు మోక్షం దక్కదు. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ నెలలో ఎవరికి ఎన్ని డేట్లు ఇవ్వాలనే విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు అంతర్గత వర్గాల టాక్.