జైపూర్లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్కు నోటీసులు జారీ చేసింది. వీరు ప్రచారం చేసిన పాన్ మసాలా యాడ్ మోసపూరితంగా ఉందని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని, ఆరోగ్యానికి హానికరమైన గుట్కా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తున్నారనే కారణంగా, జైపూర్కు చెందిన న్యాయవాది యోగేంద్ర సింగ్ బడియాల్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
అసలు సమస్య ఏమిటంటే, ఈ యాడ్లో “దానె దానె మే కెసర్ కా దమ్” అనే ట్యాగ్లైన్ ఉపయోగించారు. కానీ నిజానికి ఈ ఉత్పత్తిలో అసలు కేశర్ (సాఫ్రన్) కలిపి ఉండదని ఆరోపించారు. మార్కెట్లో కేశర్ ధర లక్షల్లో ఉంటుంది, కానీ అంత విలువైనది రూ.5ల పాన్ మసాలాలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీంతో జనాల్లో మోసం జరుగుతోందని, తప్పుడు ప్రచారం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని కోర్టుకు వివరించారు.
ఈ కేసులో కేవలం నటులనే కాదు, వాణిజ్య సంస్థ జేబీ ఇండస్ట్రీస్ అధినేత విమల్ కుమార్ అగర్వాల్కూ నోటీసులు వెళ్లాయి. న్యాయస్థానం ముద్దాయిలందరికీ మార్చి 19న హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే, వారు లేకుండానే విచారణ కొనసాగించబడుతుందని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా స్పందించాలని నటులు, కంపెనీకి కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసుపై ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఫేమస్ సెలెబ్రిటీల ప్రమోషన్లతో జనాలు తప్పుదారి పడుతున్నారని, తప్పుడు ప్రచారానికి బాధ్యత వహించాలని న్యాయవాది బడియాల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రకటనను తక్షణమే బ్యాన్ చేయాలని, వీరు చేసిన తప్పుడు ప్రచారానికి జరిమానా విధించాలని కోర్టును కోరారు. మరి, నటులు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.