అనుష్క, త్రిష మాత్రమే మిగిలారు

ఇప్పుడంతా ఓటీటీల రాజ్యం నడుస్తోంది. ఐతే అవి కేవలం సినిమాలను నమ్ముకోవట్లేదు. సొంతంగా ఒరిజినల్స్ పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీంతో వెబ్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఏ ఓటీటీ అయినా ఎన్ని సినిమాలు కొని రిలీజ్ చేసినా.. సబ్‌స్క్రైబర్లను నిలబెట్టుకోవడానికి, వాళ్లను నిరంతరం ఎంగేజ్ చేస్తూ ఉండటానికి తమదంటూ ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాల్సిందే. పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేయాల్సిందే.

నెట్ ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు అన్నీ అదే పని చేస్తున్నాయి. ఇందుకోసం భారీగా బడ్జెట్లు పెడుతున్నాయి. దీంతో ఇంతకుముందు వెబ్ సిరీస్‌లను తక్కువగా చూసిన వాళ్లు కూడా ఇప్పుడు ఆలోచన మార్చుకుంటున్నారు. దక్షిణాదిన స్టార్ హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోతుండటం విశేషం.

ఇప్పటికే సమంత ‘ఫ్యామిలీ మ్యాన్-2’తో వెబ్ సిరీస్‌ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆమెది టెర్రరిస్టు పాత్ర అంటున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’పై ముందు నుంచే మంచి అంచనాలుండగా, సమంత రాకతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి. మరోవైపు కాజల్, తమన్నా ఒకేసారి డిజిటల్ డెబ్యూకు రెడీ అయిపోయారు. వీళ్లిద్దరూ హాట్ స్టార్ కోసం వేర్వేరుగా సిరీస్‌లు చేస్తున్నారు.

ఇక సామ్, కాజల్, తమ్మూల తరానికి చెందిన మిగతా స్టార్ హీరోయిన్లలో నయనతార తన కొత్త చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ ద్వారా డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతోంది. ఈ చిత్రం దీపావళికి విడుదలవుతోంది. ఓటీటీ రిలీజ్ టార్గెట్‌తోనే ఈ సినిమా తెరకెక్కింది. నయన్ వెబ్ సిరీస్ చేయకపోయినా.. సినిమా ద్వారానే డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతోంది. పైన చెప్పుకున్న నలుగురు సీనియర్ స్టార్ హీరోయిన్లూ వచ్చే రెండు నెలల్లోనే డిజిటల్ డెబ్యూ చేయబోతుండటం విశేషం. ఇంకా లైమ్ లైట్లో ఉన్న నిన్నటి తరం స్టార్ హీరోయిన్లలో అనుష్క, త్రిష మాత్రమే డిజిటల్ ఎంట్రీ ఇవ్వలేదు. త్వరలోనే వాళ్లు కూడా అటు వైపు చూస్తే ఆశ్చర్యం లేదు.