పవన్‌తో ఉన్నదున్నట్లు తీస్తే కష్టమే

రీఎంట్రీలో వరుస బెట్టి సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాడు పవన్ కళ్యాణ్. పునరాగమనంలో తొలి చిత్రం అయిన ‘వకీల్ సాబ్’ ఇంకా పూర్తి కాలేదు కానీ.. అప్పుడే ఐదో సినిమా అనౌన్స్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవన్ నటించబోతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ చిత్రం మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ అన్నది తెలిసిన విషయమే.

పైగా పవన్ ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేయబోతున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చేశారు. దీన్ని బట్టి ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన సిన్సియర్ పోలీసాఫీసర్ పాత్రలో పవన్ నటించనున్నట్లు స్పష్టమైంది. ఐతే ఈ పాత్రను, సినిమాను ఉన్నదున్నట్లుగా తెలుగులో తీస్తే ఆడుతుందా అన్నది సందేహం.

‘అయ్యప్పనుం కోషీయుం’ ఇద్దరు ఇగోయిష్టుల మధ్య సాగే పోరు నేపథ్యంలో కొంచెం క్లాస్‌గా సాగే సినిమా. మలయాళ ప్రేక్షకుల అభిరుచికి అది బాగానే ఉంటుంది. కానీ దాన్ని తెలుగులో యాజిటీజ్‌గా తీస్తే మాత్రం మన వాళ్లకు నచ్చుతుందా అన్నది సందేహం. పైగా ఈ సినిమాను లాక్ డౌన్ టైంలో తెలుగు వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు. అలాంటపుడు తెలుగు వెర్షన్లో కచ్చితంగా మార్పు చూపించాలి.

పవన్ చేయబోయే పోలీస్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. అందులో దమ్ము కనిపిస్తుంది. కానీ మలయాళంలో మాదిరి సటిల్‌గా, క్లాస్‌గా ఆ పాత్రను నడిపిస్తే కిక్కుండదు. కచ్చితంగా ఆ పాత్రకు మరింత ఎలివేషన్ ఇవ్వాలి. మాస్ అంశాలు జోడించాలి. ‘దబంగ్’లో బేసిక్ ఐడియా తీసుకుని దాని రూపురేఖలు మార్చి హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’గా మార్చినట్లు సాగర్ కూడా ‘తెలుగు మాస్ టచ్’ ఇస్తే పవన్ పాత్ర పేలేందుకు సినిమా సూపర్ హిట్టయ్యేందుకు అవకాశముంది. అలా కాకుండా ఉన్నదున్నట్లుగా తీసేస్తే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎగ్జైట్ చేయడం కష్టమే.