గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దేవరకు కొనసాగింపుకి రంగం సిద్ధమవుతోంది. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం దర్శకుడు కొరటాల శివ బృందం గత మూడు నెలలుగా ఆ పని మీదే ఉంది. అసలైన కథ ఇందులోనే ఉంటుందనే తరహాలో ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ ని ముగించడంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నో ప్రశ్నలకు సమాధానం పార్ట్ 2లోనే చెప్పాల్సి ఉంటుంది. దీనికి టైం పట్టేలా ఉంది కాబట్టి కొరటాల వేరే హీరోతో ఇంకో సినిమా చేస్తాడనే పుకార్లు వచ్చిన నేపథ్యంలో అవేవీ నిజం కాదని తెలిసింది. ఆయన ఫోకస్ మొత్తం దేవర 2 మీదే ఉంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే వార్ 2 చివరి దశలో ఉంది. హృతిక్ రోషన్ తో కలిసి చేయాల్సిన పాట షూట్ ఇటీవలే మొదలయ్యింది. ఇంకో వారం రోజుల్లో అయిపోతుంది. చిన్న ప్యాచ్ వర్క్ మినహా దాదాపు పూర్తయినట్టే. ప్రశాంత్ నీల్ డ్రాగన్ సెట్లో ఏప్రిల్ నుంచి రెగ్యులర్ గా అందుబాటులో ఉండబోతున్నాడు. ఇది అక్టోబర్ లేదా నవంబర్ లోగా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆలా చేస్తేనే 2026 సంక్రాంతి విడుదల సాధ్యమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనేది మైత్రి మూవీ మేకర్స్ లక్ష్యం. ఇవి అయిపోతే తారక్ చేతిలో కొత్త కమిట్ మెంట్స్ లేవు.
సో దేవర 2కి మార్గం సుగమం అవుతుంది. ఈ సంవత్సరం చివర్లో లేదా జనవరి నుంచి షూటింగ్ కి వెళ్లిపోవచ్చు. బడ్జెట్ కూడా భారీగా పెంచబోతున్నారు. ఈసారి విలన్ సైఫ్ అలీ ఖాన్ తో పాటు బాబీ డియోల్ కూడా చేరతాడనే ప్రచారం నిజమేనని తెలిసింది. కాకపోతే క్యాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేవు. ఇంకా జాన్వీ కపూర్ డేట్స్ కూడా అడగలేదు. తారక్ అందుబాటుని బట్టి ఆమె కాల్ షీట్స్ ప్లాన్ చేస్తారు. అనిరుద్ రవిచందర్ సంగీతం మీద మరిన్ని అంచనాలు నెలకొనబోతున్నాయి. అంతా సవ్యంగా అనుకున్నట్టు జరిగితే 2026 దసరా లేదా దీపావళికి దేవర 2 చూడొచ్చు.