ఆ మధ్య ఛావా ఆడియో ఈవెంట్లో తనది హైదరాబాద్ గా చెప్పుకున్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో కన్నడిగుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. మూలాలు మర్చిపోయి ఇతర భాషలకు అంకితమైపోయిందంటూ కొందరు ట్వీట్లు పోస్టులు చేశారు. దానికి శ్రీవల్లి స్పందించలేదు కానీ తాజాగా రాజకీయ నాయకులు ఈ లిస్టులో చేరిపోతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం మండ్య ఎమ్మెల్యే రవికుమార్ గానిగ రష్మిక మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు పిలిచినా రాలేదని, కిరిక్ పార్టీతో తొలి అడుగులు తమ రాష్ట్రం నుంచే పడ్డాయనే విషయం మర్చిపోయిందని కస్సుబుస్సుమన్నారు.
కమిటీ తరఫున కొందరు పదిసార్లు కలిసి ఆహ్వానించారని అయినా సరే కర్ణాటక వచ్చేందుకు సమయం లేదని చెప్పి తప్పించుకుంది కాబట్టి ఆమెకు గుణపాఠం నేర్పించాలని పిలుపు ఇచ్చారు. మార్చి 1 నుంచి 8 దాకా జరుగుతున్న ఈ చిత్రోత్సవానికి శాండల్ వుడ్ నుంచి పేరున్న నటీనటులు ఎవరూ పెద్దగా పాల్గొనడం లేదు. దీనిపై డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ సైతం గుర్రుగా ఉన్నారు. వీళ్ళలో మార్పు రాకపోతే ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసంటూ చురకలు వేశారు. ఇప్పుడు జరుగుతున్నది 16వ ఫిలిం ఫెస్టివల్. ఎన్నో అవార్డు పొందిన గొప్ప సినిమాలు, డాక్యుమెంటరీలు ఇందులో ప్రదర్శిస్తున్నారు.
అయినా స్వంత ఇండస్ట్రీ నుంచే పెద్దగా సెలబ్రిటీలు రానప్పుడు ముంబై, హైదరాబాద్ షూటింగులతో బిజీగా ఉన్న రష్మిక మందన్న రాలేదని విమర్శించడం సబబు కాదని అభిమానుల వెర్షన్. మూడు బ్లాక్ బస్టర్ హిట్లు యానిమల్, పుష్ప 2, ఛావాతో దూసుకుపోతున్న ఛలో బ్యూటీకి ఈ ఏడాది ఇంకో మూడు నాలుగు రిలీజులు ఉండబోతున్నాయి. తెలుగు తమిళం కన్నా హిందీలో భారీ ఆఫర్లు దక్కించుకుంటున్న రష్మిక మందన్న మీద స్వరాష్ట్రంలో ఇలాంటి వ్యతిరేకతకు కారణం లేకపోలేదు. కన్నడ సినిమాలు చేసేంత టైం తనకు లేకపోవడమే. దీని గురించి ఏమైందా స్పందిస్తుందేమో చూడాలి.