సందీప్ రెడ్డి వంగ.. ఈ పేరు చెబితే చాలు కొంతమంది బాలీవుడ్ జనాలు షేకైపోతారు. అతను తీసే సినిమాలు మాత్రమే కాదు.. తన ఇంటర్వ్యూలు సైతం బాలీవుడ్ వాళ్లకు నిద్ర పట్టనివ్వవు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’లో ప్రకంపనలు సృష్టించాక.. ఆ చిత్రాన్ని ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేస్తే అక్కడా బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఇందులో పురుషాధిక్యతను గ్లోరిఫై చేశాడని.. సమాజాన్ని తప్పుదోవ పట్టించేశాడని ఇటు బాలీవుడ్ జనాలు, అటు క్రిటిక్స్ లబోదిబోమన్నారు. బాలీవుడ్లో దీన్ని మించిన చెడు పోకడలు ఎన్నో సినిమాల్లో చూసినప్పటికీ.. ‘కబీర్ సింగ్’ను మాత్రమే టార్గెట్ చేయడం విడ్డూరం.
ఇక తన తర్వాతి చిత్రం ‘యానిమల్’ను బాలీవుడ్ ఎలా టార్గెట్ చేసిందో తెలిసిందే. లెజెండరీ లిరిసిస్ట్, రైటర్ జావెద్ అక్తర్ సహా చాలామంది ఆ సినిమాను తీవ్రంగా విమర్శించారు. ఇక క్రిిటిక్స్ సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. కానీ వాళ్లందరికీ కేవలం తన సినిమా వసూళ్లతోనే కాదు.. తన ఇంటర్వ్యూలతోనూ ఘాటుగానే సమాధానం చెప్పాడు సందీప్. తన సినిమాలను తప్పుబట్టే వాళ్లకు ఇంటర్వ్యూల్లో సందీప్ వేసే ప్రశ్నలు.. చాలా గట్టిగానే తగులుతుంటాయి. వాటికి అవతలి వైపు నుంచి సమాధానమే ఉండదు. బాలీవుడ్ జనాల హిపోక్రసీని అతను భలేగా బయటపెడుతుంటాడు.
తాజాగా సందీప్.. కోమల్ నహతా అనే క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది కేవలం ప్రోమోతోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘కబీర్ సింగ్’ సినిమాలో నటించాడనే ఏకైక కారణంతో ఒక పెద్ద సంస్థలో ఒక నటుడికి రోల్ ఇవ్వలేదనే విషయాన్ని సందీప్ బయటపెట్టాడు. ఆ ప్రొడక్షన్ హౌస్ కరణ్ జోహార్దని, అక్కడ రిజెక్షన్కు గురైంది సోహమ్ మజుందార్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇక ‘యానిమల్’ సినిమా విషయంలో తనను అంతగా తప్పుబట్టిన వాళ్లందరూ.. రణబీర్ను మాత్రం కొనియాడడం హిపోక్రసీ కాదా అంటూ సందీప్ ప్రశ్నించాడు. ఈ రెండు అంశాలకు సంబంధించి బాలీవుడ్ జనాలకు ఆల్రెడీ సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలైపోయాయి. ప్రోమోతోనే బాలీవుడ్ను షేక్ చేస్తున్న సందీప్.. ఫుల్ ఇంటర్వ్యూతో వాళ్లకు మరెంతగా చుక్కలు చూపిస్తాడో అనే చర్చ జరుగుతోంది.