సందీప్ కిషన్.. ‘పీపుల్స్ స్టార్’ ఎందుకయ్యాడు?

టాలీవుడ్లో చాలామంది హీరోలకు వాళ్ల పేర్ల వెనుక బిరుదులున్నాయి. కొందరు హీరోలకు అభిమానులు ప్రేమతో ఈ బిరుదులిచ్చుకుంటే ఇచ్చుకుంటే.. కొందరేమో సొంతంగా వాళ్లకు వాళ్లే ఏదో ఒక ‘స్టార్’ అని తగిలించేసుకున్నారు. కొందరు హీరోల విషయంలో దర్శక నిర్మాతలు ఒత్తిడి చేసి పేరు వెనుక ఏదో ఒక ‘స్టార్’ అని వేస్తుంటారు. ఐతే ఒకరికి ఉన్న బిరుదును ఇంకొకరు వాడుకోవడం అరుదు. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత అదే బిరుదు మహేష్ బాబుకు వచ్చింది. అక్కినేని అభిమానుల్లో కొందరు ఒకప్పటి నాగార్జున బిరుదు ‘యువ సామ్రాట్’ను నాగచైతన్యకు వాడుతుంటారు.

ఐతే ఎవ్వరూ ఊహించని విధంగా ‘పీపుల్ స్టార్’ అనే నారాయణ మూర్తి బిరుదును యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఉపయోగించుకోడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నారాయణమూర్తి ఇప్పుడు యాక్టివ్‌గా లేకపోవచ్చు. కానీ విప్లవ సినిమాలతో ఆయన తెచ్చుకున్న పేరును.. యూత్ ఫుల్ మూవీస్ చేసే సందీప్ కిషన్ పెట్టుకోవడం చిత్రంగా అనిపించింది. ఐతే తన పేరు వెనుక ‘పీపుల్స్ స్టార్’ అని రావడం వెనుక కారణమేంటో సందీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘రాయన్ సినిమాలో నటించాక నాకు ఫ్యాన్స్ పెరిగారు. ఒక అభిమాన సమూహం బయటికి వచ్చింది. వాళ్లు నా గురించి రీల్స్ చేయడం చూసి నిర్మాత అనిల్ సుంకర ‘పీపుల్స్ స్టార్’ అని పెట్టుకోమని సలహా ఇచ్చారు. అదే పోస్టర్ మీద వేశారు’’ అని సందీప్ తెలిపాడు. ఇక గత కొన్నేళ్లలో ఆశించిన విజయాలు అందుకోలేకపోవడం గురించి, కెరీర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లకపోవడం గురించి సందీప్‌ను అడిగితే.. ‘‘గత ఆరేళ్లలో నా మార్కెట్ చాలా పెరిగింది. ‘నిను వీడని నీడను నేనే’ నుంచి ‘మజాకా’ వరకు చూస్తే బడ్జెట్, మార్కెట్ 12 రెట్లు అయ్యాయి.

ఏమీ లేని రోజునే పోరాడి ఇంత వరకు వచ్చాను. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లడం ఇంకా సులభం అన్నది నా అభిప్రాయం’’ అని సందీప్ తెలిపాడు. సందీప్ కొత్త చిత్రం ‘మజాకా’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.