ఆర్థిక చిక్కుల్లో సమంత వెబ్ సిరీస్ ?

రెండేళ్ల క్రితం ఖుషి చేసిన తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద సమంత దర్శనం జరగలేదు. ఆఫర్లు వస్తున్నాయి కానీ కథలు వినడం దగ్గరే ఆగిపోతోంది. స్వంత ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం ప్రకటించిన సామ్ అది ఏ దశలో ఉందో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా దాచి పెడుతోంది. ఇటీవలే వచ్చిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సిటాడెల్ హానీ బన్నీకి ఫ్యామిలీ మ్యాన్ రేంజ్ లో స్పందన రాకపోవడం కొంత నిరాశ పరిచినా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో సిరీస్ రక్త్ భ్రమండ్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తుంబాడ్ సృష్టికర్త క్రియేషన్ కావడంతో నెట్ ఫ్లిక్స్ కనివిని ఎరుగని బడ్జెట్ దీని మీద ఖర్చు పెడుతోంది.

లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే రక్త్ భ్రమండ్ కి చిన్న బ్రేక్ పడిందట. కారణం ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. సెప్టెంబర్ 2024 లో షూటింగ్ మొదలుపెట్టిన రక్త్ భ్రమండ్ ఇంకా కీలక దశకు చేరుకోకుండానే యాభై శాతం బడ్జెట్ ఖర్చైపోవడం చూసి టీమ్ షాక్ తిందట. కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దాని వెనుక ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడని గుర్తించి విచారణ చేసే పనిలో పడింది. నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ ఇప్పటిదాకా కేవలం 26 రోజులు మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది. ఇంకా బోలెడు బాలన్స్ ఉంది. ఆడిటింగ్ లో పైన చెప్పిన గుట్టు బయటపడిందని ముంబై టాక్.

ఈ సిరీస్ ని రాజ్ అండ్ డీకే పర్యవేక్షిస్తున్నారు. దర్శకుడు రహి అనిల్ బర్వే సెట్స్ లో అప్పటికప్పుడు చేస్తున్న మార్పులు చేర్పుల వల్ల కూడా నిర్మాణ వ్యయం పెరుగుతోందట. ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ కనిపించని స్థాయిలో దుబారా అయ్యిందని యూనిట్ గుసగుస. త్వరగానే స్కామ్ ని గుర్తించడంతో ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఆదిత్య రాయ్ కపూర్, వామిక గబ్బి, అలీ ఫజల్ తదితరులు నటిస్తున్న రక్త్ భ్రమండ్ లో ఇప్పటిదాకా ఓటిటి స్క్రీన్ మీద రాని బ్యాక్ డ్రాప్ ఉంటుందట. తుంబాడ్ డైరెక్టర్ కావడంతో ట్రెండ్ సెట్టర్ అవుతుందనే రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.