సూర్య, వెంకీ అట్లూరి & నాగ వంశీ – మే లో మొదలు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాకు రంగం సిద్ధమయ్యింది. ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం వర్మ రక్త చరిత్ర 2 చేశాడు కానీ అది ఆశించినంత పెద్ద విజయం అందుకోలేదు. తెలుగు మీద సూర్య ఆసక్తి ఇప్పటిది కాదు. తమ్ముడు కార్తీ స్ఫూర్తితో బ్రదర్స్ కోసం స్వంతంగా భాష నేర్చుకుని డబ్బింగ్ చెప్పుకున్నాడు.

ఆకాశం నీ హద్దురాకి ట్రై చేశాడు కానీ మళ్ళీ రిస్క్ వద్దనుకుని సత్యదేవ్ తో చెప్పించాడు. మన దర్శకులు తరచు కలుస్తూ ఉన్నా తమిళ కమిట్ మెంట్ల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ సాధ్యం చేయగలిగారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. స్క్రిప్ట్ కూడా లాకైపోయిందట. మే నుంచి షూటింగ్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. లక్కీ భాస్కర్ తరహాలో ఇది కూడా పీరియాడిక్ సెటప్ ఉంటుందని అంటున్నారు.

నిర్ధారణగా ఇంకా తెలియదు కానీ ఆటోమొబైల్ పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో ఒక ఇంజనీర్ పడిన సంఘర్షణ ఆధారంగా ఉండొచ్చని వినికిడి. హీరో ఒక కొత్త మోడల్ కారుని డిజైన్ చేసే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయట. సార్, లక్కీ భాస్కర్ ని మించిన డ్రామా, ఎమోషన్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయని అంటున్నారు.

టైటిల్ కూడా చూచాయగా కారు ఇంజిన్ నెంబర్ వచ్చేలా చూస్తున్నారట. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అట్లూరి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సూర్య ఇప్పుడు ఆర్జె బాలాజీతో చేస్తున్న 45వ సినిమా సగానికి పైగానే పూర్తయ్యింది. కార్తీక్ సుబ్బరాజ్ రెట్రో వేసవిలో విడుదల కానుంది.

వెట్రిమారన్ వాడివాసల్ ఇంకా ఆలస్యమయ్యేలా ఉండటంతో ఆలోగా వెంకీ అట్లూరి తన ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడట. ఈ కొలాబరేషన్ కారణంగానే సితార నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ తమిళ వెర్షన్ కి సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంటే ఇది ముందు నుంచి ప్లాన్డ్ గా సెట్ చేసుకున్న కాంబోని అర్థమయ్యిందిగా.