పట్టు తప్పింది… కోట్ల నష్టం మిగిలింది

స్టార్ హీరో ఉంటే చాలు కంటెంట్ అటుఇటు ఉన్నా జనం ఎగబడి చూస్తారనే భ్రమలు ఇప్పుడు లేవు. ఏ మాత్రం తేడా ఉన్నా ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. పది రోజుల క్రితం విడుదలైన పట్టుదల (విడాముయార్చి) నెగటివ్ టాక్ లోనూ వంద కోట్ల వసూళ్లు దాటాయంటే దానికి కారణం కేవలం అజిత్ ఇమేజే.

అయినా నష్టాలను నుంచి కాపాడేందుకు మాత్రం అది సరిపోలేదు. ఇప్పటిదాకా కేవలం నూటా పాతిక కోట్ల దాకా కలెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫైనల్ రన్ అయ్యేలోపు మహా అయితే నూటా యాభై కోట్ల దగ్గర క్లోజ్ చేయొచ్చని ట్రేడ్ టాక్. అంటే దాదాపు సగం వరకు లైకాకు పోయినట్టేనట.

ప్రొడక్షన్ ఖర్చు, నటీనటుల రెమ్యునరేషన్లు, అబర్ బైజాన్ షెడ్యూల్, సాంకేతిక వర్గం పారితోషికాలు, వాయిదాల వడ్డీలు వగైరా అన్నీ కలిపితే పట్టుదల మీద లైకా సంస్థ సుమారు 300 కోట్ల దాకా బడ్జెట్ ఖర్చు పెట్టిందట. తమిళంలో చాలా వరకు నయం కానీ ఇతర భాషల్లో మాత్రం అవుట్ రైట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

పరిస్థితి ఎలా ఉందంటే వారం తిరక్కుండానే హెచ్డి పైరసీ వస్తే దాన్ని కనీసం పట్టించుకోలేనంత దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అజిత్ కాకుండా త్రిష, అర్జున్, రెజీనా, అనిరుద్ రవిచందర్ ఇలా పేర్లు చూస్తేనే చాలు ఎంత సొమ్ములు కరిగిపోయి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఒకరకంగా పాఠమని చెప్పాలి.

రజనీకాంత్ లాల్ సలామ్, కమల్ హాసన్ భారతీయుడు 2, సూర్య కంగువ, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇవన్నీ పరిశ్రమకు ఖరీదైన పాఠాలుగా మారిపోతున్నాయి. వీటి సరసన పట్టుదల కూడా చేరిపోయింది. అజిత్ తర్వాతి సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా లేకుండా ఏప్రిల్ 10 విడుదల చేయమని మైత్రి మూవీ మేకర్స్ మీద అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు.

తమ హీరో అసలైన స్టామినా అప్పుడు చూస్తారని యాంటీ ఫ్యాన్స్ కు సవాల్ విసురుతున్నారు. మనకు యావరేజ్ గా అనిపించినా మొన్న ఏడాది సంక్రాంతికొచ్చిన తెగింపు అజిత్ కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ అంటే ఆశ్చర్యం వేసినా అదే నిజం.