ఓవైపు రికార్డులు బ్రేక్… అంతలోనే వివాదం

సనమ్ తేరి కసమ్.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతటా చర్చనీయాంశం అవుతున్న సినిమా. ఎప్పుడో 2016లో రిలీజై, పెద్దగా ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయిన ఫెయిల్యూర్ మూవీ ఇది. కానీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ విరగబడి చూస్తున్నారు. గత వారం వచ్చిన కొత్త చిత్రాలను వెనక్కి నెట్టి ఈ సినిమా బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు రూ.30 కోట్లు దాటిపోయాయి.

ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్‌తో పోలిస్తే ఈ వసూళ్లు కొన్ని రెట్లు ఉండడం విశేషం. ఇది స్టార్ హీరో సినిమా కాకపోయినా.. ఒక రీ రిలీజ్‌కు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం అనూహ్యం. కొన్ని నెలల కిందట ‘తుంబాడ్’ రీ రిలీజ్‌‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘సనమ్ తేరి కసమ్’ అంతకు మించిన సెన్సేషన్ అనే చెప్పాలి. దీంతో ఇందులో భాగమైన అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన హర్షవర్ధన్ రాణె ఈ చిత్రంలో హీరో కావడం విశేషం.

ఐతే ‘సనమ్ తేరి కసమ్’ ఇంకా థియేటర్లలో సందడి చేస్తుండగా.. ఓ వివాదం చెలరేగింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్లు దర్శక ద్వయం రాధికా రావు, వినయ్ ప్రకటించడమే కాక, వచ్చే ఏడాది వేలంటైన్స్ డేకు దీన్ని రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. కానీ దీనిపై నిర్మాత దీపక్ ముకుత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన అనుమతి లేకుండా సీక్వెల్ చేసే హక్కు వారికి అతను స్పష్టం చేశాడు.

‘‘సనమ్ తేరి కసమ్ చిత్రాన్ని నేనే నిర్మించాను. ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి హక్కులు నాకే ఉన్నాయి. ఆ కథకు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీయాలంటే అది నేనే చేయాలి. నేను గత సెప్టెంబరులోనే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని ప్రకటించా. హర్షవర్ధన్ రాణెతోనే ఈ సినిమా ఉంటుందని కూడా చెప్పా. సీక్వెల్‌కు దర్శకుడెవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయమై రాధిక, వినయ్‌లతోనే నేను మాట్లాడలేదు.

వారు కూడా సీక్వెల్ గురించి నాతో సంప్రదించలేదు. ఇటీవల సినిమా రీ రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూల్లో పాల్గొని తమ పాటికి తాము సీక్వెల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ముందు నన్ను సంప్రదించాల్సిన బాధ్యత వారి మీద ఉంది’’ అని దీపక్ పేర్కొన్నాడు. దీనిపై రాధిక, వినయ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.