పుష్కరం తర్వాత ‘సిరిమల్లె చెట్టు’ దర్శనం

గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయి ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే ఇది అన్ని సినిమాలకు వర్తించదు. కొన్ని టైంతో సంబంధం లేకుండా అభిమానులు ఎదురు చూసేలా ఉంటాయి. అలాంటిదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

సరిగ్గా పుష్కరం క్రితం అంటే పన్నెండు సంవత్సరాల 2013 లో రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అప్పట్లో రామ్ చరణ్ నాయక్ లాంటి మాస్ సినిమాను తట్టుకుని వసూళ్లు సాధించడం చిన్న విషయం కాదు. చాలా సెంటర్లలో రికార్డులు నమోదయ్యాయి. మహేష్ బాబుని కుటుంబాలకు మరింత దగ్గర చేసింది ఈ చిత్రమే.

మార్చి 7 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇమేజ్, మార్కెట్ కి భయపడి మల్టీస్టారర్లు లేకుండా పోయిన టాలీవుడ్ లో వాటికి శ్రీకారం చుట్టింది వెంకటేష్, మహేష్ బాబు. ఎలాంటి ఫైట్లు, కమర్షియల్ మసాలాలు, ఐటెం సాంగులు లేకపోయినా కంటెంట్ లో బలం గుర్తించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఒప్పుకున్నారు కదాని అవసరం లేనివి జొప్పించకుండా తాను అనుకున్నది నిజాయితీగా తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత దిల్ రాజు దానికి తగ్గట్టే గొప్ప ఫలితాన్ని అందుకున్నారు. గోదారి తీరం మీద ప్రేమను చాటుకున్నారు.

తర్వాతే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం పెరిగింది. గోపాలా గోపాల, మసాల, ఆర్ఆర్ఆర్, వాల్తేర్ వీరయ్య లాంటి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లన్నీ అలా వచ్చినవే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే టైటిల్ పెట్టడమే అప్పట్లో పెద్ద రిస్క్. అయినా సరే జనం రిసీవ్ చేసుకున్నారు.

చిన్నోడు పెద్దోడుగా వెంకీ, మహేష్ చేసిన అల్లరి, పండించిన ఎమోషన్లు అలా గుర్తుండిపోయాయి. మిక్కీ జె మేయర్ పాటలు, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అందాన్ని తీసుకొచ్చాయి. మురారిని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడీ సిరిమల్లె చెట్టుకి ఎలాంటి స్వాగతం పలుకుతారో చూడాలి.