మంచు మోహన్ బాబుకు బెయిల్ మంజూరు

ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబుకు గురువారం భారీ ఊరట లభించింది. టీవీ జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చాలా కాలంగా బెయిల్ కోసం ఎదురు చూస్తున్న మోహన్ బాబు ఊపిరి పీల్చుకున్నారు.

తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబుకు అక్కడ నిరాశ ఎదురు కాగా… ఆ తర్వాత ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చాలా రోజుల క్రితమే మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేసినా… గురువారం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

తన చిన్న కుమారుడు మంచు మనోజ్ తో మోహన్ బాబుకు ఆస్తి వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో మోహన్ బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు నిలవగా… మనోజ్ మాత్రం తన సతీమణి భూమి మౌనికతో కలిసి పోరాటం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో వివాదం రేగిన ఆదిలోనే జల్ పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌజ్ కు మనోజ్ వచ్చారన్న సమాచారంతో మీడియా అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో మోహన్ బాబు ముందు మైక్ పెట్టిన ఓ మీడియా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో జర్నలిస్టుకు గాయాలు కాగా… చాలా రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు కాగా…పోలీసులు మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు యత్నించారు. అయితే అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటున్నానని, విచారణకు తాను తర్వాత హాజరవుతానని చెబుతూవచ్చిన మోహన్ బాబు… బెయిల్ కోసం యత్నాలు మొదలుపెట్టారు.

ఈ క్రమంలో తొలుత హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు… ఆ తర్వాత నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే…ఇప్పటికీ మోహన్ బాబు ఇంట ఆస్తుల పంచాయతీ ఇంకా తెగనేలేదు. పోలీసులను దాటేసిన ఈ పంచాయతీ.. ప్రస్తుతం రెవెన్యూ అధికారుల హయాంలో కొనసాగుతోంది.