నిన్న చిరంజీవి ముఖ్యఅతిథిగా జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ సవ్యంగా జరిగింది కానీ ఒక్క చిన్న స్పీచ్ పెనుముప్పులా మారిపోయింది. థర్టీ ఇయర్స్ పృథ్వి ఈ సినిమాలో మేకల సత్యం క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ షూటింగ్ మొదట్లో నూటా యాభై ఉండేవి చివరికి పదకొండు మేకలే మిగిలాయని చెప్పడం సోషల్ మీడియాలో దుమారం రేపింది.
ఆయన ఉద్దేశపూర్వకంగానే అధికారం కోల్పోయిన వైసిపి పార్టీ సీట్ల సంఖ్యను గుర్తుకుతెచ్చేలా మాట్లాడారంటూ కార్యకర్తలకు కోపం రావడంతో ఏకంగా లైలాను బాయ్ కాట్ చేద్దామని ప్రతిపాదించే దాకా వెళ్ళింది. గంటల్లోనే వైరల్ అయిపోయింది.
దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా లైలా టీమ్ దీనికి సంబంధించిన వివరణ ప్రెస్ మీట్ రూపంలో ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. సరే ఇదంతా ఓకే కానీ అసలు సందర్భం లేకుండా కావాలని పదకొండు సంఖ్యని నొక్కి వక్కాణించడం ఈ చిక్కును తెచ్చి పెట్టింది. టిడిపి జనసేన కూటమి గెలిచాయి. చక్కగా పాలిస్తున్నాయి.
ప్రజలు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ సమయంలో అదే పనిగా అపోజిషన్ ని గిల్లేలా ఎక్కడ కామెంట్లు చేసినా దాని ప్రభావం నేరుగానో మరో రూపంలోనో సినిమాల మీద పడుతుంది. ఆ మధ్య రెండు మూడు ఈవెంట్లలో ఇలాంటి ఉదంతాలు జరిగి ఓపెనింగ్స్ ఎఫెక్టయ్యాయి.
ఏది ఏమైనా సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనడానికి లేదు. కొన్నిసార్లు తెలియకుండానే వీటి మధ్య ముడి పడిపోతుంది. అలాంటప్పుడు ఆచితూచి వ్యవహరించడం అవసరం. చిరంజీవి అంతటి వ్యక్తి వచ్చినప్పుడు వివాదాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మెగాస్టార్ స్పీచ్ పక్కకు వెళ్ళిపోయి పృథ్విది హైలైట్ కావడం లైలాకు ఎంత మాత్రం మింగుడుపడని వ్యవహారం.
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్న విశ్వక్ సేన్ ప్రమోషన్ పరంగా ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టడం లేదు. బ్రహ్మ ఆనందం మినహా పోటీ పెద్దగా లేకపోవడం కలిసొచ్చేలా ఉంది.