హ్యాపీ న్యూస్.. షూటింగ్‌కు సంజయ్ దత్

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ గురించి రెండు నెలల కిందట బయటికి వచ్చిన సమాచారం ఆయన అభిమానులను కలచి వేసింది. పెద్ద స్టారే అయినప్పటికీ.. చేసిన తప్పుల ఫలితంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సంజయ్.. కొన్నేళ్ల కిందటే జైలు శిక్ష పూర్తి చేసుకుని కాస్త ప్రశాంత జీవనం సాగిస్తున్నాడు. ఇంతలో అతడికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందన్న చేదు నిజం బయటపడింది. ఆ క్యాన్సర్ కూడా మూడో దశలో ఉన్నట్లు వెల్లడి కావడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయింది. వెంటనే చికిత్స ఆరంభించారు వైద్యులు.

ఐతే క్యాన్సర్ చికిత్స అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ నేపథ్యంలో సంజయ్ ఇక సినిమాలు చేస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. ఆయన చేస్తున్న, చేయాల్సిన సినిమాల పెట్టుబడి దాదాపు రూ.700 కోట్లు కావడం గమనార్హం. ఇంకా మొదలుపెట్టని సినిమాల్లో అంటే వేరే వాళ్లను తీసుకోవచ్చు. సంజు పాత్రను వేరే వాళ్లతో భర్తీ చేయలేని పరిస్థితి ఉంటే.. ఆపేయొచ్చు.

కానీ సంజయ్ ఇప్పటికే నటిస్తున్న భారీ చిత్రాల పరిస్థేంటన్నది అయోమయంగా మారింది. ముఖ్యంగా సంజు విలన్ పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కేజీఎఫ్-2’ సంగతేంటన్న ప్రశ్న తలెత్తింది. ఆ సినిమాకు సంబంధించి సంజు మీద ఇంకా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి ఉండటంతో చిత్ర బృందానికి ఎటూ పాలుపోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ గురించి సంజు దగ్గర ప్రస్తావించలేని పరిస్థితి.

ఐతే ఆ టీం ఇబ్బందిని అర్థం చేసుకున్న సంజయ్.. ఓవైపు క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూనే ఆ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం ‘కేజీఎఫ్-2’ షూటింగ్‌కు మళ్లీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా తనే ఒక ఫొటో షూట్ చేసి దాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇది సంజయ్ అభిమానులకే కాదు.. ‘కేజీఎఫ్-2’ మీద భారీ అంచనాలతో ఉన్న ప్రేక్షకులకూ మహదానందం కలిగించింది. ఈ రోజుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇదే అతి పెద్ద వార్తగా నిలిచింది. ఇంత బాధలోనూ తన బాధ్యతను పూర్తి చేస్తున్న సంజయ్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.