కంగనా కమిట్మెంట్‌కు సెల్యూట్ కొట్టాల్సిందే..

కంగనా రనౌత్ కొన్ని నెలలుగా సినిమాయేతర విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం బాలీవుడ్ బడా బాబులు చాలామంది మీద ఆమె తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించడం.. అలాగే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనతో కయ్యం పెట్టుకోవడం.. ఈ గొడవల నేపథ్యంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రత కల్పించడం.. ఇలా పలు విషయాలతో ఆమె వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

ఈ మధ్యే ఆమె వీటి నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని మళ్లీ సినిమా షూటింగ్ మీద ఫోకస్ పెట్టింది. ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్న ‘తలైవి’ చిత్రాన్ని ఆమె ఫినిష్ చేసింది. లాక్ డౌన్ ముంగిట ఈ చిత్ర చివరి షెడ్యూల్‌కు బ్రేక్ పడింది. ఎట్టకేలకు మిగిలిన ఆ సన్నివేశాలను కంగనా పూర్తి చేసింది.

‘తలైవి’ సినిమా కోసం కెరీర్లో ఎన్నడూ లేని స్థాయిలో బరువు పెరిగింది కంగనా. ఆ పెరిగిన బరువు ఏకంగా 20 కిలోలట. బాలీవుడ్లో టాప్ స్టార్‌గా ఉన్న కంగనా.. ఓ సౌత్ సినిమా కోసం ఈ స్థాయిలో బరువు పెరగడం అంటే చిన్న విషయం కాదు. మెథడ్ యాక్టింగ్‌ను ఫాలో అయ్యే కంగనా.. పాత్ర కోసం ఎలా కావాలంటే అలా మారిపోతుంటుంది. ‘తలైవి’ కోసం కూడా అలాగే తన అవతారాన్ని మార్చుకుంది.

కొన్ని సన్నివేశాలు మిగిలిపోయాయని.. వేరే కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి అదే లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఆ సినిమా పూర్తి కావడంతో మళ్లీ లుక్ మార్చుకునే పనిలో పడింది. ఎంతో కష్టపడి చూస్తుండగానే బరువు తగ్గిపోయింది. తాజాగా స్లిమ్‌గా మారిన తన లేటెస్ట్ లుక్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ లుక్ చూసి అందరూ షాకవుతున్నారు.

ఇంత తక్కువ సమయంలో కంగనా అంతలా ఎలా బరువు తగ్గి అలాంటి ఫిజిక్‌లోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. బయటి వివాదాల సంగతెలా ఉన్నా సరే.. సినిమాల వరకు అయితే కంగనా టాలెంట్‌ను, ఆమె కమిట్మెంట్‌ను ఎంతమాత్రం తక్కువ చేయలేం.