జక్కన్నకు నచ్చని 50 పర్సంట్ ఐడియా

ఏడు నెలల విరామం తర్వాత ఈ నెల 15న దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ముందు నుంచి అనుకుంటున్నట్లే థియేటర్లలో 50 శాతం సీట్లనే ఫిల్ చేసుకోవడానికి అనుమతించింది ప్రభుత్వం. దీనికి తోడు థియేటర్లలో కరోనా నియంత్రణ చర్యలు పాటించాల్సి ఉంది. ఐతే ఈ షరతులు, నిబంధనల మధ్య సినిమాలు ఏం నడుస్తాయో అన్న సందేహాలున్నాయి.

ప్రేక్షకులు కూడా భయపడకుండా థియేటర్లకు వస్తారా అన్నదీ అనుమానమే. అయితే ప్రభుత్వం థియేటర్లు తెరవడానికి అనుమతించడమే మహా భాగ్యం అన్నట్లుగా ఉంది ఎగ్జిబిటర్ల పరిస్థితి. ముందు థియేటర్లు తెరిచాక ఆ తర్వాత ఫుల్ ఆక్యుపెన్సీ కోసం డిమాండ్ చేసే అవకాశముంది. ఐతే ఈలోపే దర్శక ధీరుడు రాజమౌళి ఈ 50 పర్సంట్ ఆక్యుపెన్సీ గురించి ప్రతికూలంగా స్పందించాడు. ఇది సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలోనే థియేటర్లను తెరవాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘‘అన్ని ఇంఃస్ట్రీలను ఓపెన్ చేసినట్లు సినీ ఇండస్ట్రీని ఓపెన్ చేస్తే సమస్య ఏమీ ఉండదు. సినిమా ఇండస్ట్రీని ప్రత్యేకంగా చూడటం వల్ల, 50 శాతం సీట్లనే అందుబాటులో ఉంచడం వల్ల థియేటర్‌కు వెళ్తే ప్రమాదమా అన్న ఆలోచన జనాలకు వస్తుంది. విమానాల్లో పక్క పక్కన కూర్చుని రెండు మూడు గంటలు ప్రయాణిస్తున్నారు. వాటితో పోల్చితే థియేటర్లలో సీట్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుంది. మరి అలాంటప్పుడు యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయడం కరెక్ట్ కాదేమోనని అనుకుంటున్నాను. అలాగే జనాలు మాస్కులు వేసుకోకుండా ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్లిపోయి గుంపులు కడుతున్నపుడు రాని ప్రమాదం.. మాస్కులు వేసుకుని సినిమా థియేటర్ కు వెళ్లినప్పుడు వస్తుందని నేను అనుకోవడం లేదు’’ అంటూ రాజమౌళి కుండబద్దలు కొట్టేశాడు.