మన సూపర్‍స్టార్లకు విలన్స్ లేరు

తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు కొత్త కొరత వచ్చింది. ప్రస్తుతం మన పెద్ద సినిమాలకు విలన్లు దొరకడం లేదు. జగపతిబాబు రొటీన్‍ అయిపోవడంతో ఇప్పుడాయనను తీసుకోవడానికి దర్శకులు ఇష్టపడడం లేదు. రాజశేఖర్‍, నారా రోహిత్‍, గోపీచంద్‍ తదితరులు విలన్‍ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించట్లేదు.

దీంతో పరభాషా సీనియర్‍ హీరోలను తెచ్చి ఇక్కడ విలన్లుగా చేయించడానికి మన దర్శకులు తంటాలు పడుతున్నారు. కన్నడ స్టార్‍ ఉపేంద్ర ఇటీవల చాలా తెలుగు సినిమా విలన్‍ క్యారెక్టర్లను రిజెక్ట్ చేసాడు. విజయ్‍ సేతుపతి ‘ఉప్పెన’లో విలన్‍గా నటించినా కానీ తర్వాత పుష్ప సినిమాకు డేట్లు సర్దుబాటు చేయలేకపోయాడు. మాధవన్‍కి కూడా విలన్‍ క్యారెక్టర్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు.

ధృవలో విలన్‍గా చేసిన అరవింద్‍ స్వామి కోసం పరశురామ్‍ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మహేష్‍తో చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో విలన్‍గా అరవింద్‍ స్వామి నటించే అవకాశం వుందట. ఇంతవరకు పుష్పలో అల్లు అర్జున్‍కి విలన్‍ ఎవరనేది తేలలేదు. మొన్నటివరకు హీరోయిన్ల కొరత మాత్రమే తెలుగు సినిమా దర్శకులను ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు విలన్స్ కొరత కూడా తోడవడం షెడ్యూల్స్ ప్లానింగ్‍కి పెద్ద ఇబ్బందిగా పరిణమించింది.