రెహమాన్‌కు మళ్లీ కోపం వచ్చింది

పాత పాటలను రీమిక్స్ చేసే సంస్కృతి చాలా ఏళ్ల నుంచి ఉంది. ఇప్పుడది మరింత ఊపందుకుంటోంది. ఏఐ ద్వారా దివంగత గాయకుల వాయిస్‌లను వాడుకుంటూ కూడా పాత క్లాసిక్ సాంగ్స్‌ను రీమిక్స్ చేస్తున్నారు. ఐతే ఈ ఒరవడిని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు.

మామూలుగా రెహమాన్ ఎవ్వరినీ విమర్శించడు. కఠినంగా మాట్లాడడు. కానీ రీమిక్స్ ట్రెండ్ విషయంలో మాత్రం ఆయన అసంతృప్తిని దాచుకోలేకపోతున్నారు. ముకాబులా, ఊర్వశీ లాంటి తన పాటలు కొన్నింటిని రీమిక్స్ చేయడం పట్ల రెహమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒకసారి చేసిన పాటను మళ్లీ ట్యూన్ చేయడంలో ఏం క్రియేటివిటీ ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలా చేయడానికి ఎవరికీ హక్కు లేదని.. కనీసం అనుమతి కూడా అడగకుండా ఇలా పాటలను రీమిక్స్ చేసేస్తున్నారని గతంలో రెహమాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజాగా ఆయన మరోసారి ఈ ట్రెండును తప్పుబట్టారు.‘‘ఆరేళ్ల కిందట సూపర్ హిట్ అయిన పాటను ఇప్పుడు కాపీ కొట్టి.. రీమిక్స్ చేశా అని గొప్పగా చెబుతున్నారు. అలా చేయడం తప్పు. ఒరిజినల్ సాంగ్‌ను క్రియేట్ చేసిన వ్యక్తి అనుమతి తీసుకోకుండా ఇలా ఎలా చేస్తున్నారు.

ప్రస్తుత రోజుల్లో సంగీతంలోనూ ఏఐని ఉపయోగిస్తున్నారు. కంపోజన్ స్టైల్ కాపీ కొట్టినప్పటికీ అతడికి డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. భవిష్యత్తులో ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. నైతిక సమస్యలు ఏర్పడతాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది’’ అని రెహమాన్ అన్నాడు.

రీమిక్స్ పాటల విషయంలో నిర్మాతల నుంచి అనుమతి తీసుకుంటున్న సంగీత దర్శకులు ఒరిజినల్ కంపోజర్స్ నుంచి పర్మిషన్ తీసుకోవట్లేదనే విమర్శలున్నాయి. ఈ విషయంలోనే రెహమాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను రీమిక్స్ చేయనని.. అలా చేసేవాళ్లను కూడా సమర్థించనని రెహమాన్ ముందు నుంచి స్పష్టం చేస్తూనే ఉన్నాడు.