థియేటర్ల కోసం కొట్టుకోవడమొకటే తక్కువ

పెద్ద సినిమాలు ఒకేసారి క్లాష్ అవుతున్నప్పుడు ముందొచ్చే ప్రధాన సమస్య థియేటర్ల పంపకం. బాలీవుడ్ కు ఇదే పలుమార్లు పెద్ద సమస్యగా మారుతోంది. నవంబర్ 1 దీపావళి సందర్భంగా ఒకే రోజు సింగం అగైన్, భూల్ భులయ్యా 3 రిలీజవుతున్న సంగతి తెలిసిందే. వీటికి స్క్రీన్లు సమానంగా పంచాలనే డిమాండ్ ఒకవైపు వినిపిస్తుండగా స్టార్ పవర్ ఎక్కువ ఉన్న దానికి అధికంగా కేటాయించాలని ఇంకోవైపు కనిపిస్తోంది. అంచనాలు, ప్లస్సులు మైనస్సులు చూసుకుంటే రెండూ ఒకే స్టేజిలో ఉన్న మాట వాస్తవం. కాకపోతే సింగం అగైన్ లో తారల ఆకర్షణలు బోలెడు ఉండటంతో త్రాసు కొంచెం అటువైపు ఎక్కువ తూగుతోంది.

సింగం అగైన్ కు రిలయన్స్. జియో సంస్థలతో పాటు అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. తమ పలుకుబడిని ఉపయోగించి ఎక్కువ స్క్రీన్లు బ్లాక్ చేసుకుంటున్నారని భూల్ భులయ్యా 3 తీసిన టి సిరీస్ ఆరోపిస్తోందట. తమకంటూ స్వంత డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉన్నప్పటికీ దాన్ని బలహీన పరిచే స్థాయిలో సింగం బృందం తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. సింగం అగైన్ డిస్ట్రిబ్యూషన్ లో పివిఆర్ కు 60 శాతం వాటా ఉండటం వల్లే ఎక్కువ షోలు దానికే పడుతున్నాయనేది మరో వెర్షన్. సింగల్ స్క్రీన్లు కూడా అదే స్థాయిలో బ్లాక్ చేసి పెట్టుకున్నారట.

ఇప్పుడీ పంచాయితీ సిసిఐ (కాంపిటీషన్ కమీషన్ అఫ్ ఇండియా) కు చేరిందని సమాచారం. ఇద్దరికీ సమానంగా స్క్రీన్లు, షోలు వచ్చేలా చేయాలని భూల్ భూలయ్యా 3 మేకర్స్ డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ వివాదం సద్దుమణగాలి. ఎందుకంటే విడుదలకు ఇంకో వారం రోజులు మాత్రమే ఉంది. ఇది చక్కబడితే తప్ప దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేరు. సింగం అగైన్ లో అజయ్ దేవగన్, టైగర్ శ్రోఫ్, దీపికా పదుకునే, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్ భాగంగా కాగా భూల్ భులయ్యా 3లో కార్తీక్ ఆర్యన్, త్రిప్తి డిమ్రి, మాధురి దీక్షిత్, విద్యా బాలన్ తదితరులున్నారు.