వీరమల్లు.. 20 నిమిషాల ఆయువు పట్టు

పవన్ కళ్యాణ్ కు పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆసక్తి లేకున్నా పట్టుబట్టి నిర్మాత AM రత్నం హరిహర వీరమల్లు ప్రాజెక్టును లైన్ లో పెట్టాడు. ఇక తీరా ఆ సినిమా పవన్ పాలిటిక్స్ కారణంగా వాయిదాలతో ఇబ్బంది పడింది. చివరకు దర్శకుడు క్రిష్ మరో ప్రాజెక్టుకు షిఫ్ట్ కావడంతో జ్యోతికృష్ణ ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా కంటెంట్ పై ఆడియెన్స్ లో ఇప్పటికి ఒక క్లారిటీ అయితే లేదు.

పవన్ పాన్ ఇండియా, హిస్టారికల్ నేపథ్యం అనే అంశాలు మాత్రమే కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక టీజర్ వస్తే అసలు విషయం ఏమిటనేది అర్ధమవుతుంది. సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక మొదటి భాగంలో అసలైన ఆయువు పట్టు ఒక 20 నిమిషాల ఎపిసోడ్ లో ఉంటుందని తెలుస్తోంది.

పవన్ కత్తి సాము పోరాటాలు, యుద్ధ వాతావరణం బిగ్ స్క్రీన్ కు కనుల విందుగా ఉంటుందట. దాదాపు 40 రోజుల పాటు ఈ ఎపిసోడ్ కోసం వర్క్ చేశారని తెలుస్తోంది. పవన్ ఈ యాక్షన్ సీన్‌లో పాల్గొనేందుకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ యుద్ధ సన్నివేశానికి తగినట్టుగా టెక్నికల్ ఎలిమెంట్స్‌ ద్వారా హాలీవుడ్ స్థాయి విజువల్స్, సంగీతం ఏర్పాటు చేస్తామని చిత్ర బృందం తెలిపింది.

సినిమాలో మొగల్ చక్రవర్తుల కాలం నాటి నేపథ్యం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. ఇక నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు ఇందులో భాగమవుతున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.