బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ.. మూడోది మొదలైంది

బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫ్రాంఛైజీ సినిమాల్లో ‘స్త్రీ’ ఒకటి. మన ఫిలిం మేకర్స్ ఎప్పుడో పీల్చి పిప్పి చేసిన హార్రర్ కామెడీ జానర్‌లో కొన్నేళ్ల కిందట రాజ్-డీకే ప్రొడక్షన్ నుంచి వచ్చిన ‘స్త్రీ’ సూపర్ హిట్ అయింది. అప్పట్లో అది మామూలు హిట్టే. కానీ దానికి ఇటీవల సీక్వెల్ తీస్తే అది మామూలు బ్లాక్ బస్టర్ కాలేదు.

ఏకంగా రూ.700 కోట్ల వసూళ్లు రాబట్టి ఇండియాలో అత్యధిక కలెక్షన్లు తెచ్చుకున్న హిందీ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇందులో కథ మరీ కొత్తగా ఏమీ అనిపించదు. ఎప్పట్నుంచో చూస్తున్న ఫార్మాట్లోనే సాగింది. కానీ థ్రిల్, ఎంటర్టైన్మెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి.

బాక్సాఫీస్ దగ్గర మంచి టైమింగ్ కూడా కుదిరింది. దీంతో సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన శ్రద్ధా కపూర్ రేంజే మారిపోయింది. ఒక సీక్వెల్ సూపర్ హిట్టయ్యాక ఇంకో సినిమా తీయకుండా ఎలా ఉంటారు?

‘స్త్రీ-3’ ఉంటుందనే ఇంతకుముందే హింట్ ఇచ్చిన మేకర్స్.. ఈసారి రెండో భాగం తరహాలో ఎక్కువ టైం తీసుకోవట్లేదు. వీలైనంత త్వరగా ‘స్త్రీ-3’ని సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి చూస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలైపోయినట్లు శ్రద్ధా కపూర్ తెలిపింది.

మూడో భాగంలో ఎంటర్టైన్మెంట్ పీక్స్‌లో ఉంటుందని ఆమె హామీ ఇచ్చింది. “స్త్రీ చూసినపుడు ఇలాంటి సినిమా ఇప్పటిదాకా రాలేదే అనిపించింది. మళ్లీ దాని సీక్వెల్ కోసం సంప్రదించినపుడు ఆశ్చర్యపోయా. స్త్రీ-2 చాలా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు మరో సీక్వెల్‌ కోసం పనులు జరుగుతున్నాయి. మూడో పార్ట్‌లో దీన్ని మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ వర్క్ మొదలైంది. కథ పరంగా చాలా డెవలప్ చేశారు. నా పాత్ర కూడా చాలా బాగుంటుంది” అని శ్రద్ధా కపూర్ చెప్పింది. స్త్రీ-3లోనూ శ్రద్ధతో పాటు రాజ్ కుమార్ రావు ముఖ్య పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.