పుష్ప-2 ఐటెం సాంగ్.. ఆమెనే ఫిక్స్

సుకుమార్ సినిమా అంటే కథ ఎలాంటిదైనా అందులో ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ‘రంగస్థలం’ లాంటి సీరియస్ మూవీలో కూడా పూజా హెగ్డేతో ఐటెం సాంగ్ పెట్టించాడు సుకుమార్. తర్వాతి చిత్రం ‘పుష్ప: ది రైజ్’లో సమంతతో ఐటెం సాంగ్ చేయించాడు. ‘ఊ అంటావా మావా..’ అంటూ సాగే ఆ పాట ఎంత పాపులర్ అయిదో.. జనాలను ఎలా ఊపేసిందో తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప-2’లోనూ ఐటెం సాంగ్ ఉంటుందనడంలో ఎవరికీ సందేహాలు లేవు.

ఐతే రిలీజ్‌కు సమయం నెలన్నరే ఉండగా.. ఇంకా ఆ పాట చిత్రీకరించలేదు. ఇంతకీ ఆ పాటలో ఎవరు కనిపిస్తారనే సస్పెన్స్ కూడా కొనసాగుతోంది. ఇంతకుముందు రకరకాల పేర్లు వినిపించాయి. చివరగా తెరపైకి వచ్చిన పేరు.. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌దే. తాజా సమాచారం ప్రకారం పుష్ప-2 ఐటెం సాంగ్‌కు ఆమెనే ఖరారైపోయింది.

రెండు రోజుల కిందటే ‘పుష్ప-2’ నిర్మాతలు శ్రద్ధా కపూర్‌కు అడ్వాన్స్ ఇచ్చేశారు. ఇంకొన్ని రోజుల్లోనే ఆ పాట చిత్రీకరణ ఉంటుంది. ఇటీవలే ‘స్త్రీ-2’ రికార్డ్ బ్రేకింగ్ హిట్ అయిన నేపథ్యంలో శ్రద్ధా డిమాండ్ మామూలుగా లేదు. ఆమె భారీ పారితోషకం అడిగినా.. హిందీలో తనకున్న మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు వెనుకంజ వేయలేదు. ‘పుష్ప-2’కు హిందీలో కూడా బంపర్ క్రేజ్ ఉంది. ఇక శ్రద్ధా ఐటెం సాంగ్ చేస్తే అక్కడి జనం మరింత ఊగిపోతారనడంలో సందేహం లేదు.

ఈ పాట కూడా ‘ఊ అంటావా..’ స్థాయిలో ఉంటే దాని రీచ్ మామూలుగా ఉండదు. ఈ పాటకు గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూరుస్తారని.. దేవిశ్రీ ప్రసాద్ మంచి ఊపున్న పాటనే కంపోజ్ చేశాడని సమాచారం. నవంబరు తొలి వారంలో ఈ పాట చిత్రీకరణ ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే టాకీ పార్ట్ పూర్తి కానుంది. తర్వాత ఐటెం సాంగ్‌తో పాటు మరో పాట కూడా షూట్ చేయాల్సి ఉంది. ‘పుష్ప-2’ డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.