కాంతార హీరోతో జై హనుమాన్ ?

2024 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా సంచలన రికార్డులు నమోదు చేసిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇంకా మొదలుకాని సంగతి తెలిసిందే. మొదటి భాగంలో హనుమంతుడిని గ్రాఫిక్స్ లో చూపించినట్టు కాకుండా ఈసారి ఎవరైనా పెద్ద హీరోతో చేయించాలనేది దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచన. తొలుత చిరంజీవి, రామ్ చరణ్ అంటూ ఏవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ నిజానికవి వట్టి పుకార్లే. తాజా లీక్ ప్రకారం కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని అంజనీ పుత్రుడిగా దాదాపు ఖరారు చేసుకున్నట్టు బెంగళూరు టాక్. ప్రస్తుతం కాంతార 2లో బిజీగా ఉన్న ఇతను ఇంకో ఆరేడు నెలలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు.

ఈ లోగా జై హనుమాన్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు మోక్షజ్ఞ డెబ్యూ మూవీని పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నాడు ప్రశాంత్ వర్మ. దాని తర్వాతే జై హనుమాన్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. రిషబ్ శెట్టి కథ విని సానుకూలంగా స్పందించాడని, సహజంగా దైవభక్తి మెండుగా ఉండే ఇతను కోరి మరీ అంత గొప్ప పాత్ర వస్తే నో చెప్పే ఛాన్స్ ఉండదని ఇన్ సైడ్ టాక్. మొదటి భాగం నిర్మించిన ప్రైమ్ షో కాకుండా ఈసారి మైత్రి మూవీ మేకర్స్ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని తెలిసింది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాబట్టి ఖరారుగా చెప్పలేం కానీ ఫిలిం నగర్ వర్గాల్లో న్యూస్ అయితే బలంగా ఉంది.

కాంతారతో జాతీయ స్థాయిలో గుర్తింపు, మార్కెట్ తో పాటు జాతీయ అవార్డు సాధించుకున్న రిషబ్ శెట్టి నిజంగా హనుమంతుడిగా చేస్తే బెస్ట్ ఛాయస్ అవుతాడు. సీక్వెల్ కోసం ప్రశాంత్ వర్మ భారీ కాన్వాస్ సిద్ధం చేసుకున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే స్థాయిలో కథా కథనాలు వస్తున్నాయట. అయితే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం మోక్షజ్ఞ తెరంగేట్రం మీద ఉంది కాబట్టి జై హనుమాన్ తాలూకు ఇతర పనులు టీమ్ చూసుకుంటోంది. ఇతర దర్శకులతో సినిమాటిక్ యునివర్స్ ని విస్తరించే పనిలో ఉన్న ప్రశాంత్ వర్మ ఇటీవలే మహాకాళిని అనౌన్స్ చేయడం ఆసక్తి రేపింది.