మెగా రివ్యూ జరుపుకుంటున్న విశ్వంభర

ఇటీవలే విడుదలైన విశ్వంభర టీజర్ కొచ్చిన మిశ్రమ స్పందన ఊహించినట్టే చిరంజీవి దాకా వెళ్ళిపోయింది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ మీద అధిక శాతం నెగటివ్ రెస్పాన్స్ రావడంతో సోషల్ మీడియా ట్రోలింగ్ గట్టిగానే జరిగింది. యాంటీ ఫ్యాన్స్ పనిగా కొందరు అభిమానులు సమర్ధించుకున్నప్పటికీ 5జి కాలంలో గ్రాఫిక్స్ నాణ్యతను చిన్న పిల్లాడు సైతం సులభంగా జడ్జ్ చేయగలుగుతున్నాడు. ఆది పురుష్ బాలేదనే సంగతి పక్కనపెడితే ఆన్ లైన్ పోస్ట్ మార్టం వల్లే ఎక్కువ డ్యామేజ్ జరుపుకుంది. ఇప్పుడు విశ్వంభరకు సైతం అలా జరిగే సూచనలు ఉండటంతో మెగా టీమ్ వెంటనే అలెర్టయిపోయింది.

అంతర్గత సమాచారం మేరకు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిని చిరంజీవే స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత అదే పనిగా ఇంత గ్యాప్ తీసుకుని, కళ్యాణ్ కృష్ణకు ఓకే చెప్పిన సినిమాను వదలుకుని మరీ విశ్వంభరకు ఓటేశారు మెగాస్టార్. అలాంటప్పుడు రాజీపడే సమస్యే ఉండదు. కానీ ఊహించని విధంగా విశ్వంభరకు ఇలాంటి టాక్ రావడంతో తనతో గతంలో పని చేసి, ఎక్కువ ర్యాపొ ఉన్న ఒకరిద్దరు దర్శకులతో దీని గురించి చర్చిస్తున్నట్టు తెలిసింది. వశిష్టకు ఇబ్బంది లేకుండా ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద చోటా కె నాయుడు సైతం వీటిలో పాల్గొంటున్నారట.

విడుదల ఎప్పుడో మేలో అనుకుంటున్నారు కాబట్టి చేతిలో ఇంకా ఆరు నెలలకు పైగా సమయముంది. ఒకటికి పదిసార్లు అవుట్ ఫుట్ చెక్ చేసుకోవచ్చు. షూటింగ్ దాదాపు అయిపోయింది కనక టెన్షన్ లేదు. ఒక క్రమ పద్ధతి ప్రకారం అన్నీ సర్దుబాటు చేయొచ్చు. యువి బడ్జెట్ విషయంలో కాంప్రోమైజ్ అయ్యే బాపతు కానప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో విశ్లేషణ చేసుకోవాలి. టీజర్ లో చూపించిన కొన్ని షాట్స్ అసలు సినిమాలో లేవని, లెన్త్ కోసం ఏఐ వాడితే అవే చేటు చేశాయని చిత్ర బృందం భావిస్తోందట. ఈ డ్యామేజ్ తగ్గాలంటే ట్రైలర్ తో సరిచేయాలి. రిలీజ్ దూరంలో ఉంది కనక వెయిటింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు.