చిరు మార్నింగ్ షో.. నాగ్ మ్యాట్నీ.. మాది ఫ‌స్ట్ షో


ఈసారి ద‌స‌రా పండ‌క్కి ఆస‌క్తిక‌ర బాక్సాఫీస్ స‌మ‌రం చూడ‌బోతున్నాం. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునల సినిమాలు గాడ్ ఫాద‌ర్, ది ఘోస్ట్ ఆ పండ‌క్కి ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ద‌స‌రా రోజైన అక్టోబ‌రు 5న వీటితో పాటు స్వాతిముత్యం అనే చిన్న సినిమా కూడా విడుద‌ల‌వుతోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ త‌మ్ముడైన బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా ఇది. అత‌డి స‌ర‌స‌న వ‌ర్ష బొల్ల‌మ్మ న‌టించింది. ఇలాంటి కాంబినేష‌న్లో ల‌క్ష్మ‌ణ్ అనే ఒక సినిమా అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడు తీసిన సినిమాను అంత పెద్ద సినిమాల‌కు పోటీగా ద‌స‌రా రేసులో దించ‌డం ఆశ్చ‌ర్యం అనే చెప్పాలి. ముందేమో ఇది ప‌బ్లిసిటీ గిమ్మిక్ అయి ఉంటుంద‌ని, రిలీజ్ టైం ద‌గ్గ‌ర ప‌డేస‌రికి వెన‌క్కి త‌గ్గుతార‌ని అనుకున్నారు. కానీ ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్భంగా చిత్ర బృందం ద‌స‌రా రిలీజ్‌ను క‌న్ఫ‌మ్ చేసింది. ప‌క్కాగా అక్టోబ‌రు 5నే త‌మ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు నిర్మాత నాగ‌వంశీ తెలిపాడు.

మ‌రి అంత పెద్ద సినిమాల‌కు పోటీగా ఏ ధైర్యంతో మీరీ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నార‌ని మీడియా వాళ్లు అడిగితే.. నాగ‌వంశీ ఆస‌క్తిక‌ర సమాధానం చెప్పాడు. అంద‌రూ త‌మది చిన్న చిత్రం అంటున్నార‌ని, కానీ ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుంచి ఈ సినిమా వ‌స్తోంద‌ని మ‌రిచిపోవ‌ద్ద‌ని.. త‌మకు బ‌ల‌మైన డిస్ట్రిబ్యూష‌న్ టీం ఉంద‌ని.. అంద‌రం క‌లిసి సినిమాను జ‌నాల్లోకి తీసుకెళ్తామ‌ని చెప్పాడు నాగవంశీ. ద‌స‌రా టైమింగ్‌కు స‌రిపోయే చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ కావ‌డం త‌మ సినిమాకు ప్ల‌స్ అయ్యే అంశ‌మ‌ని.. ద‌స‌రా టైంలో మార్నింగ్ షో చిరంజీవి సినిమా, మ్యాట్నీకి నాగార్జున మూవీ చూసే ప్రేక్ష‌కులు.. ఫ‌స్ట్ షోకు త‌మ సినిమాకు వ‌స్తార‌నే న‌మ్మ‌కం ఉంద‌ని అత‌ను వ్యాఖ్యానించాడు.

ఇక బెల్లంకొండ గ‌ణేష్ లాంచింగ్ గురించి మాట్లాడుతూ.. తమ క‌థ‌కు స‌రిపోయే అమాయ‌కంగా క‌నిపించే అబ్బాయి కోసం చూస్తుండ‌గా గ‌ణేష్ దొరికాడ‌ని.. తాము గ‌ణేష్ అనే అబ్బాయితో సినిమా చేశాం అనుకుంటున్నామే త‌ప్ప‌.. ఒక కొత్త హీరోను లాంచ్ చేస్తున్న‌ట్లు అస‌లు ఫీల‌వ్వ‌ట్లేద‌ని నాగ‌వంశీ స్ప‌ష్టం చేశాడు.