ముందస్తుఎన్నికలు తప్పదా ?

తెలంగాణాలో మధ్యంతర ఎన్నికలు తప్పేట్లు లేదు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని అనుకుంటున్న కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలంటే అప్పటికి తాను ఫ్రీగా ఉండాలని అనుకుంటున్నారట. అప్పటికి తాను ఫ్రీగా ఉండాలంటే తెలంగాణాలో ఎన్నికలు ఉండకూడదు. ఎంఎల్ఏ, ఎంపీ ఎన్నికలు ఏకకాలంలో జరిగితే రెండు ఎన్నికల్లో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.

అందుకనే అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిపేస్తే షెడ్యూల్ పార్లమెంటు ఎన్నికల నాటికి స్వేచ్చగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టవచ్చని కేసీయార్ భావిస్తున్నారట. ఈ కారణంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని కేసీయార్ దాదాపు డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు. అందులోను రెగ్యులర్ గా పార్టీ పరిస్ధితిపై సర్వేలు చేయించుకుంటున్నారు. ఎలాగూ టీఆర్ఎస్+ప్రభుత్వంపై సర్వేలు చేయించుకుంటారు కాబట్టి కాంగ్రెస్, బీజేపీల పరిస్ధితిపైన కూడా ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవటం ఖాయం.

ఇలాంటి లేటెస్టు ఫీడ్ బ్యాక్ లోనే బీజేపీ పరిస్ధితి వాళ్ళు చెప్పుకుంటున్నట్లుగా గొప్పగా లేదని తెలిసిందట. 119 నియోజకవర్గాల్లో చాలాచోట్ల గట్టి అభ్యర్ధులు కూడా పోటీకి బీజేపీలో లేరన్నది నిజం. ఇదే విషయం కేసీయార్ తెప్పించుకున్న ఫీడ్ బ్యాక్ లో స్పష్టమైందట. కాబట్టి మధ్యంతర ఎన్నికలకు వెళితే బీజేపీని గట్టి దెబ్బకొట్టవచ్చన్నది కూడా ఆలోచన. ఇక కాంగ్రెస్ అంటారా ఆపార్టీ నేతలు ఎన్నికల ముందు గొడవలు పడుతునే ఉంటారు తర్వాత కూడా పడుతునే ఉంటారు. ఒకళ్ళకి టికెటిస్తే మరో నలుగురు అసమ్మతి నేతలు తయారవుతారు.

కాబట్టి మధ్యంతర ఎన్నికలకు వెళిపోతే మెజారిటీ సీట్లతో కానీ కనీసం సింగిల్ లార్జెస్టు పార్టీగానే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం కేసీయార్ లో బలంగా ఉందట. సో, ప్రతిపక్షాలను లేవకుండా దెబ్బకొట్టాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం ఒకటే మార్గమనేది కేసీయార్ కు అర్ధమైందని టీఆర్ఎస్ నేతలంటున్నారు. అన్నీ కలిసొస్తే ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరిగే అవకాశముందంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.