దూత మీద థాంక్ యు బరువు

పట్టుమని మూడు రోజులు దాటకుండానే నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన థాంక్ యు తాలూకు గాయాలను మర్చిపోయేందుకు అక్కినేని అభిమానులు నెక్స్ట్ వచ్చే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ది ఘోస్ట్, ఏజెంట్ లో ఏది వర్కౌట్ అయినా వాళ్ళ బాధ తగ్గిపోతుంది. అయితే చైతుకి ప్రత్యేకంగా ఉన్న ఫ్యాన్స్ మాత్రం బిగ్ స్క్రీన్ మీద తమ హీరోని చూసుకోవాలంటే కొంత టైం పడుతుంది కానీ ఆలోగా అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్న వెబ్ సిరీస్ దూతలో ఎక్కువ సేపు చూసే ఛాన్స్ దొరుకుతుంది.

థాంక్ యు దర్శకుడు విక్రమ్ కె కుమారే దర్శకత్వం వహించిన దూత షూటింగ్ ఇంకొంత బాలన్స్ ఉంది. పూర్తయిన భాగానికి ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఒకేసారి రెండింటి మీద ఫోకస్ పెట్టడం వల్ల విక్రమ్ కుమార్ సినిమా మీద పట్టు తప్పారేమో అనే అనుమానం ఓ దశలో కలిగింది కానీ అది వాస్తవం కాదు. థాంక్ యుని పూర్తి చేశాకే దూతని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. దీనికి ప్రైమ్ ఆర్టిస్టుల పారితోషికాలతో కలిపి 45 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్టు ఓటిటి వర్గాల కథనం. ఇప్పటిదాకా తెలుగులో ఇదే హయ్యెస్ట్.

కాకపోతే వెబ్ సిరీస్ కాబట్టి దూత వల్ల చైతుకి ఎంత ప్రయోజనం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే బిగ్ లీగ్ లో ఉన్న స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా ఓటిటిలో అడుగు పెడుతున్నారు. పాతిక కోట్ల దాకా మార్కెట్ కెపాసిటీ ఉన్న హీరోల్లో చైతునే మొదటగా ఇలా ట్రై చేస్తున్నది. ఇది కనక సక్సెస్ అయితే మిగిలినవాళ్లు ఫాలో కావొచ్చు. ది ఫ్యామిలీ మ్యాన్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. హారర్ జానర్ లో రూపొందిన దూతలో చైతు ఆత్మలతో మాట్లాడే శక్తులున్న వ్యక్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారట.