మంత్రిగా ప‌నికిరానా..? జ‌గ‌న్‌ పై ఎస్సీ ఎమ్మెల్యే ఫైర్‌

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెద్ద దుమారం రేపుతోంది. ఆశావహులు చెలరేగిపోతున్నారు. వారిని శాంతింపజేసేందుకు దూతలు చర్చలు జరుపుతున్నారు. అయినా వారిని శాంతింపజేయడం అధికార పార్టీకి తెలనొప్పిగా మారింది. ఈ క్ర‌మంలో విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అయితే.. ఆయ‌న తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కార్యకర్తల కోసం హింసావాదిగా మారతానని, హింసా రాజ‌కీయాలు చేస్తాన‌ని సీఎం జగన్‌కు అల్టిమేటం జారీ చేశారు.

జగన్ కోసం ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి.. బలమైన కాంగ్రెస్‌ను ఎదిరించానని తెలిపారు. అయినా.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని అన్నారు. తన కార్యకర్తల కోసం హింసావాదిగా మారతానని హెచ్చరించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయినా మంత్రి పదవి ఇవ్వలేదని వాపోయారు. తన కోసం వందల మంది నాయకులు.. పాయకరావుపేట నుండి తరలివచ్చారని తెలిపారు. ఇకపై అగ్రెసివ్‌గా ముందుకెళ్తానని బాబూరావు హెచ్చరించారు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సెగలు వైసీపీలో ఇంకా తగ్గలేదు. కొన్నిచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పదవి రానందుకు అసంతృప్తి లేదంటూనే పలువురు నేతలు అలకబూనారు. పదవులు ఆశించి భంగపడిన వారి అనుచరులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌ నిర్ణయాలకు తిరుగులేదు. 2019 మే 8న కొలువుతీరిన తొలి మంత్రివర్గం కూర్పుపైనా ఆయన్ను వేలెత్తిచూపేందుకు ఎవరూ సాహసించలేదు.

కానీ మూడేళ్లకే పరిస్థితులు మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణపై నిరసనలు హోరెత్తాయి. పైకి అంతా బాగుందంటున్నా.. పదవి దక్కని నేతల ముఖాల్లో చిరునవ్వే కరువైంది. ఇప్పటి వరకూ తనవాళ్లు తనను పొగడ్తలతో ముంచెత్తడం, ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడడమే చూసిన జగన్‌కు.. వాళ్ల అసంతృప్తి, వారి అనుచరులు, కార్యకర్తల ఆగ్రహావేశాలు నివ్వెరపరిచాయని అంటున్నారు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన బాబూరావు.. 2019 ఎన్నిక‌ల్లో రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌రావు పేట నుంచి పోటీ చేసి.. విజ‌యం సాధించారు. ఎస్సీల్లో మంచి ప‌ట్టున్న నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కారుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.