కాంగ్రెస్ పుంజుకుంటోందా ?

క్షేత్ర స్థాయిలో తాజాగా జరిగిన పరిణామాలను చూసిన తర్వాత ఇదే అనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన 29 అసెంబ్లీ, 3 పార్లమెంట్ ఉపఎన్నికల్లో బీజేపీకి పెద్ద షాకే తగిలింది. బీజేపీ విషయాన్ని పక్కనపెట్టేస్తే కాంగ్రెస్ కు ఊహించని విధంగా సానుకూల ఫలితాలు దక్కాయి. గడచిన రెండున్నరేళ్ళల్లో ఎక్కడ అసెంబ్లీ, లోక్ సభ ఉప ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలే తప్ప విజయం అంటు దక్కిందే లేదు. అలాంటిది తాజా ఉపఎన్నికల్లో ఏకంగా 8 అసెంబ్లీలతో పాటు ఒక పార్లమెంటు సీటును గెలుచుకోవటమంటే మామూలు విషయం కాదు.

హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభలో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ పార్లమెంటుకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఇదే రాష్ట్రంలో జరిగిన 3 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు బీజేపీని ఖంగుతినిపించారు. దీంతో అధికారంలో ఉండికూడా ఈ రాష్ట్రంలో నాలుగు స్ధానాల్లో బీజేపీ ఓడిపోయినట్లయ్యింది. కర్నాటకలోని రెండు అసెంబ్లీలకు జరిగిన ఉపఎన్నికల్లో ఒకటి కాంగ్రెస్ గెలిచింది.

ఇక హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి గెలిచారు. అయితే రెండో స్ధానంలో కాంగ్రెస్ నిలవగా మూడో స్ధానంతో బీజేపీ సరిపెట్టుకుంది. దాద్రానగర్ హవేలి ఎంపీ స్ధానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ శివసేన అభ్యర్థి గెలవటం గమనార్హం. కాకపోతే అస్సాం, మధ్యప్రదేశ్ లో మాత్రం బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. అస్సాంలో జరిగిన 5 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమే గెలిచింది. అలాగే మధ్యప్రదేశ్ లోని ఒక స్థానంలో బీజేపీనే గెలిచింది.

మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుంటోందనే తాజా ఉపఎన్నికలు నిరూపిస్తున్నాయనే అనుకోవాలి. మామూలుగా అయితే అసలు ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా కాంగ్రెస్ విజయం సాధించి ఎంతకాలమైందో ఆ పార్టీ నేతలకు మరచిపోయారు. ఎక్కడ ఎన్నికైనా గెలుపు మాత్రం బీజేపీదే అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. పశ్చిమబెంగాల్లో జరిగిన నాలుగు అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ ఒక్కటి కూడా గెలవలేదు. ఇందులో రెండు నియోజకవర్గాల్లో బీజేపీ సిట్టింగ్ ఎంఎల్ఏలే ఉన్నారు. అయినా నాలుగింటినీ తృణమూల్ కాంగ్రెస్సే క్లీన్ స్వీప్ చేసేసింది.

నరేంద్ర మోడీ సర్కార్ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనేందుకు ఈ ఫలితాలే తాజా ఉదాహరణ. నిజంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు గనుక ఐకమత్యంగా అభ్యర్థి కోసం కష్టపడితే గెలుపు కష్టమేమీ కాదని అర్ధమవుతోంది. కాకపోతే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హస్తం పార్టీ నేతల్లోని గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలే పార్టీ పరువును గంగపాలు చేస్తోంది. తెలంగాణాలో జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో హస్తం పార్టీ సాధించిన ఓట్లే గ్రూపు రాజకీయాలకు తాజా ఉదాహరణ.