ఏడాదిలో మొదటిసారి సీఎం జగన్ వెనుకడుగు!

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయ అంశం జగన్‌కు భారీ వ్యతిరేకతను తీసుకు వచ్చింది. గడిచిన ఏడాది కాలంలో వివిధ అంశాలపై విమర్శలు ఎదుర్కొంటోంది. జగన్‌పై హిందూ వ్యతిరేకి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ ఆస్తుల అంశంపై బీజేపీ, జనసేన సహా భక్తులు గళమెత్తారు.

సోషల్ మీడియాలో పెద్దఎత్తున జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భూములను విక్రయించాలని ఇంకా నిర్ణయించలేదని, గత ప్రభుత్వం హయాంలోనే విక్రయించాలని నిర్ణయించారని, వీటిని సమీక్షిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాత్కాలిక ఊరట ప్రకటన చేశారు.

ఈ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. టీటీడీ భూముల అమ్మకంపై నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, జగన్ ఓ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఏడాది కాలంలో బహుశా ఇదే మొదటిసారి అయి ఉండవచ్చునని, ఇది సంతోషించదగ్గ విషయమన్నారు. టీటీడీ భూముల అమ్మకంపై నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లే రాజధాని అమరావతిపై కూడా పునరాలోచన చేయాలని సూచించారు.

జగన్ అధికారంలోకి వచ్చాక రాజధానిగా అమరావతిని తొలగించి, మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కేవలం చంద్రబాబుపై కక్షతోనే ఇదంతా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని, మూడు రాజధానులు సరికాదని విపక్షాలు కూడా సూచిస్తున్నాయి.

మూడు రాజధానుల అంశాన్ని దాదాపు అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ టీటీడీ భూముల విషయంలో తొలిసారి వెనక్కి తగ్గారని, రాజధాని అంశంపై కూడా పునరాలోచించాలని సూచించడం గమనార్హం.

నిరర్థక ఆస్తులపై టీటీడీ త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి భూముల విక్రయానికి చేపట్టిన అన్ని ప్రక్రియలను నిలిపివేస్తూ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నిర్ణయం తీసుకున్నారు.

ఆస్తుల విక్రయం కోసం ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక బృందాలను రద్దు చేశారు. అయితే తాత్కాలికంగా అమ్మకాన్ని వాయిదా వేశారు. దీనిపై పోరాడేందుకు బీజేపీ, జనసేన సిద్ధమయ్యాయి.