అన్న అవుట్‌… త‌మ్ముడైనా టీడీపీని కాపాడ‌తాడా ?


విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదా? ఎవ‌రూ పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదా? అంటే.. ఔన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ మూడు సార్లు విజ‌యం ద‌క్కించుకుంది. ఈ మూడు సార్లు కూడా 1983, 1985, 1994 ఎన్నిక‌ల్లో శంబంగి వెంక‌ట చిన అప్ప‌ల‌నాయుడు టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత .. పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్క‌డం అంటే.. చిన్న విష‌యం కాద‌ని అప్ప‌ట్లో రాజ‌కీయ వ‌ర్గాలు సైతం చ‌ర్చించుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. దీనికి మ‌రో కార‌ణం కూడా ఉంది. పార్టీల‌తో సంబంధం లేకుండా ఉన్న బొబ్బిలి రాజుల ఇమేజ్ కూడా ఇక్క‌డ టీడీపీ విజ‌యం సాధించ‌క‌పోవ‌డానికి మ‌రో ప్ర‌ధాన కార‌ణం.

ఇక‌, 2004 ఎన్నిక‌ల త‌ర్వాత‌ నుంచి బొబ్బిలి టీడీపీలో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ ఎన్నిక‌ల్లో వెంక‌ట అప్ప‌ల‌నాయుడు టీడీపీ త‌ర‌ఫున ఓడిపోయారు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టిన అధిష్టానం.. తెర్లాం మాజీ ఎమ్మెల్యే తెంటు ల‌క్ష్మునాయుడుకు ఇక్క‌డ అవ‌కాశం ఇచ్చారు. దీంతో 2009, 2014 ఎన్నిక‌ల్లో ల‌క్ష్మునాయుడు టీడీపీ టికెట్ పై పోటీ చేశారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ త‌ర‌ఫున రావు సుజ‌య్ కృష్ణ‌రంగారావు బ‌రిలోకిదిగారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భావం.. కాంగ్రెస్‌పై సానుభూతి క‌లిసి.. ఇక్క‌డ టీడీపీ వ‌రుస ప‌రాజ‌యాల‌పాలైంది. ఇక‌, ఆ త‌ర్వాత కూడా పార్టీని నిల‌బెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే, 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన సుజ‌య్‌ను చంద్ర‌బాబు పార్టీలోకి ఆహ్వానించి.. మంత్రిని చేశారు. ఇది మ‌రింత‌గా పార్టీలో చిచ్చు పెట్టింది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న నేత‌ల‌ను చిన్న‌బుచ్చార‌నే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు అంతో ఇంతో పార్టీ కోసం కృషి చేసిన వారు కూడా సైలెంట్ అయిపోయారు. అన్నింటికీ సుజ‌య్ నే కీల‌కంగా మారారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఏకంగా సుజ‌య్‌కే చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో అప్ప‌టి వ‌ర‌కు త‌ట‌స్థంగా ఉన్న శంబంగి వైసీపీలోకి వ‌చ్చి విజ‌యం సాధించారు.

పోనీ.. ఆ త‌ర్వాత అయినా.. సుజ‌య్ యాక్టివ్‌గా ఉన్నారా? అంటే.. అది కూడా లేదు. ఆయ‌న రాజ‌కీయంగా యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతో ఆయ‌న సోద‌రుడు బేబి నాయ‌న‌కు ఇన్‌చార్జ్ ప‌గ్గాలు అప్ప‌గించారు. మ‌ళ్లీ బొబ్బిలి రాజుల చేతికే పార్టీ ప‌గ్గాలు వెళ్ల‌డంతో పార్టీలో కొంద‌రు నేత‌లు, కొన్ని సామాజిక వ‌ర్గాల వారు దూరంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు టీడీపీకి ద్వితీయ శ్రేణి కేడ‌ర్ దూర‌మ‌వుతోన్న ప‌రిస్థితి. సుజ‌య్ కుటుంబంలోనే అన్న‌ద‌మ్ముల రాజ‌కీయాలు డిఫ‌రెంట్‌గా ఉండ‌డం.. వైసీపీని వీడి రావ‌డంపై ప్ర‌జ‌లు సైతం వీరిపై అసంతృప్తితోనే ఉన్నారు. అందుకే బొబ్బిలి రాజులు గ‌త ఎన్నిక‌ల్లోనే తొలిసారి ఓడిపోయారు. మ‌రి ఈ నిస్తేజ స్థితి నుంచి బొబ్బిలి టీడీపీ ఎప్పుడు బ‌య‌ట ప‌డుతుందో ? బేబి నాయ‌న ఏం చేస్తారో ?చూడాలి.